Citizen Grievance: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని పౌరుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన అధికారికంగా ప్రకటించారు.
ప్రజావాణి కార్యక్రమం మాదాపూర్లోని న్యాక్ (NAC) బిల్డింగ్లో ఉన్న సీఎంసి కార్యాలయం మొదటి అంతస్తులోని మీటింగ్ హాల్లో జరుగుతుంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.00 గంటల వరకు పౌరులు తమ ఫిర్యాదులను నేరుగా అధికారులకు అందజేయవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ పౌర సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించనున్నారు. ముఖ్యంగా.. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు.. చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత, వెలగని దీపాలు లేదా కొత్త లైట్ల ఏర్పాటు కోసం.. ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో జాప్యం లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు.. అదే విధంగా.. తాగునీటి సమస్యలు , ఇతర పౌర సేవలు.
ఈ కార్యక్రమం ద్వారా పౌరులు కమిషనర్ను నేరుగా కలిసి తమ సమస్యలను వివరించే వీలుంటుంది. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి.. వాటి పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. తమ ప్రాంతాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కమిషనర్ సృజన విజ్ఞప్తి చేశారు.
Also Read: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం.. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!