ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన పార్టీ మార్పు వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి మారలేదంటూ ఈ ఏడాది మార్చి 11వ తేదీన స్పీకర్ కీలక తీర్పు వెలువరించారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే క్వాష్ చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే స్పీకర్ కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన జరిగిన లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుండి నామినేషన్ వేశారు. బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడమే పార్టీ ఫిరాయింపునకు నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే వాదిస్తున్నారు. నామినేషన్ వేసిన రోజు నుండే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడవుతారని పిటిషన్లో స్పష్టం చేశారు. ఆయనను తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.
కేవలం అనర్హత వేటు వేయడమే కాకుండా దానం నాగేందర్ గత ఏడాది ఏప్రిల్ 23 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పొందిన జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి కోరడం విశేషం. అనర్హుడైన వ్యక్తి ప్రభుత్వ ఖజానా నుండి ప్రయోజనాలు పొందడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ రాజకీయంగా దానం నాగేందర్కు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం నాడు న్యాయస్థానం ఈ అంశంపై ప్రాథమిక విచారణ జరపనుంది. స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? స్టే విధిస్తుందా లేక పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల కేసుల్లో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ALSO READ: CM Revanth Reddy: రేపు సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి