Delhi Blast Case: స్వేఛ్చ బ్యూరో: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుళ్ల కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఉమర్ అనే ఉగ్రవాది భారీగా పేలుడు పదార్థాలు ఉన్న కారులో కూర్చుని తనను తాను పేల్చుకోవటం ద్వారా విస్ఫోటనం సృష్టించాడు. దీంట్లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఉగ్రవాదులు 2022లోనే ఈ కుట్ర చేసినట్టుగా తాజాగా బయట పడింది. దీనిని అమలు చేయటానికి అన్సార్ ఇంటీరియం పేర ఓ సంస్థను కూడా ప్రారంభించినట్టుగా తేలింది. గత ఏడాది నవంబర్ 11న న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ వద్ద హుండయ్ ఐ20 కారు పేలిన విషయం తెలిసిందే. దీంట్లో పదమూడు మంది మృత్యువాత పడగా పలువురికి గాయాలయ్యాయి. మొదట దీనిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేయగా ఆ తరువాత విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎన్ఐఏ(NIA) అధికారులు జరిపిన విచారణలో దిగ్ర్భాంతికర విషయాలు బయట పడ్డాయి.
ఎన్ఐఏ జరిపిన విచారణలో పేలుళ్లకు కుట్ర చేసింది.. అమలు చేసింది అంతా డాక్టర్లే అని నిర్ధారణ అయ్యింది. జిహాద్ పట్ల ఆకర్షితులైన ముజమ్మిల్ గన్నీ, ముజఫర్ మౌల్వీ ఇర్ఫాన్, అమీర్, తౌఫిల్ గాజీ, ఉమర్ నబీ, ఆదిల్ లు 2022, ఏప్రిల్లో శ్రీనగర్లో సమావేశమై పేలుళ్లకు పథకం వేసినట్టుగా తేలింది. దీనిని అమలు చేయటం కోసమే అన్సార్ ఇంటీరియం అనే సంస్థను ప్రారంభించి ఆదిల్ను దానికి ఛీఫ్గా నియమించినట్టుగా బయట పడింది. ఇక, ఎవరెవరు ఏయే పనులు చేయాలన్నది అప్పుడే నిర్ణయించుకున్నట్టుగా వెల్లడైంది. అప్పుడే కోడ్ వర్డ్స్ను కూడా పెట్టుకున్నట్టుగా తేలింది. దీని ప్రకారం ఉమర్ గ్రూప్ లోని అందరినీ సమన్వయ పరిచే బాధ్యతలు తీసుకోగా ముజమ్మిల్ గన్నీ ఫైనాన్స్, ఐఈడీ బాంబులు తయారు చేయటానికి అవసరమైన పరికరాలను కొనే పని తీసుకున్నాడు. ఈ క్రమంలో 2023లో బాంబులు తయారు చేయటానికి అవపరమైన పరికరాలు, అమ్మోనియం నైట్రేట్ను ఈ గ్రూప్ సోహ్నా నుంచి కొనుగోలు చేసింది. పొటాషియం నైట్రేట్ను ఫరీదాబాద్లోని ఓ కెమికల్ షాప్ నుంచి సమకూర్చుకుంది.
Also Read: West Bengal Murder: దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికేసి, మూడు చోట్ల పడేసి.. చివరకు?
ఇక, ఉమర్ నబీ ఆన్ లైన్ లో వీడియోలు చూసి ఐఈడీ బాంబులు ఎలా తయారు చేయాలన్నది నేర్చుకున్నట్టుగా ఎన్ఐఏ విచారణలో తేలింది. నిజానికి దక్షిణ కాశ్మీర్కు చెందిన డానిష్ను మానవ బాంబుగా మార్చి కుట్రను అమలు చేయాలని అంతా కలిసి అనుకున్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో డానిష్ను ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చి జిహాద్లో ప్రాణం ఇస్తే నేరుగా ఆ భగవంతుని వద్దకు పోతావ్ అని బ్రెయిన్ వాష్ కూడా చేసినట్టుగా తెలిసింది. అయితే, మానవ బాంబుగా మారటానికి మొదట సిద్ధపడ్డ డానిష్ ఆ తరువాత వెనుకడుగు వేయటంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా వెల్లడైంది.
ఢిల్లీలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు లేదా ఆలయం వద్ద పేలుళ్లు సృష్టించాలని మొదట ఈ ఉగ్రవాదులు కుట్రలు పన్నారు. అయితే, దీనిని మొదట జమ్మూ కాశ్మీర్ పోలీసులు పసిగట్టారు. అనంతరం ఉగ్రవాదుల కోసం వేటను మొదలు పెట్టారు. దీంతో పేలుళ్లు జరపటానికి కుట్ర చేసిన అందరిలో భయం మొదలైంది. ఏం చేయాలో అర్థంగాక ఉమర్ నబీ పేలుడు పదార్థాలను కారులో పెట్టుకుని ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలానికి వచ్చి తనను తాను పేల్చుకోవటం ద్వారా కుట్రున అమలు చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: Pilot Rohit Reddy: హైదరాబాద్లో ఉద్రిక్తత, సీఐపై దాడి కేసులో రోహిత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!