Baby Sale: స్వేచ్ఛ బ్యూరో: పేదరికమో.. మరేదైనా కారణం ఉందో తెలియదుగానీ ఓ తల్లి పేగుతెంచి జన్మనిచ్చిన బిడ్డనే అంగట్లో సరుకుగా చేసింది. కన్న మమకారం మరిచి కాసులకు అమ్ముకోవటానికి ప్రయత్నించింది. విషయం తెలిసి ఎల్బీనగర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ జిల్లాకు చెందిన లాల్ మోన్ ఖాతున్, మొహమ్మద్ సుల్తాన్ భార్యాభర్తలు. ఎనిమిది రోజుల క్రితం ఖాతున్ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలా ఉండగా ఎల్బీనగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్ నగర్ నివాసి ముక్తార్ బేగ్ (62) చిన్న కుమార్తెకు సంతానం లేదు. దాంతో ఆయన నవజాత శిశువును చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం ఖాతున్ కు తెలిసింది. ఈ క్రమంలో ఈనెల ఖాతున్ తన ఎనిమిది రోజుల వయసున్న బిడ్డను తీసుకుని ముక్తార్ బేగ్ను కలిసింది. శిశువును దత్తతకు ఇస్తానని చెప్పి లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగింది. అయితే, అనుమానం రావడంతో ముక్తార్ దీనికి నిరాకరించారు.
Also read: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!
మరుసటి రోజు రాత్రి మళ్లీ శిశువుతో వచ్చిన ఖాతున్ తన పెద్ద కూతురి వివాహం కోసం అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పి 30 వేలు ఇస్తే శిశువును ఇస్తానని తెలిపింది. దీంతో అనుమానం మరింత పెరగడంతో ముక్తార్ బేగ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు ఖాతున్ ను అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఖాతున్ కు నోటీసు జారీ చేశారు. ఖాతున్ తోపాటు శిశువును కమిటీకి అప్పగించారు.
Also read: రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్