Minimum wages revision: తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. పొన్నం ప్రభాకర్.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి.. లేబర్ కమిషనర్ దాసరి హరి చందనతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వేతనాల సవరణ ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ క్రమంలో దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో అమలవుతున్న వేతన విధానాలను కమిటీ కూలంకషంగా పరిశీలించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకురానున్న నూతన ‘లేబర్ కోడ్’ (Labour Code) అంశాల ప్రభావం రాష్ట్ర కార్మికులపై ఎలా ఉండబోతోందనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల వేతనాలను కేవలం అంకెల్లో కాకుండా.. వారి వాస్తవ అవసరాలు.. పెరుగుతున్న ధరలు.. జీవన వ్యయానికి అనుగుణంగా సవరించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
దేశంలోని అత్యుత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణను ‘కార్మికుల పక్షపాతి’ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి.. కార్మికులకు గరిష్ట మేలు చేకూర్చే విధంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అసంఘటిత.. సంఘటిత రంగ కార్మికులకు భారీ లబ్ధి చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.