Deputy CM Bhatti Vikramarka: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండేళ్ల కాలంలోనే రూ.20,000 కోట్లు కేటాయించి నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం హైటెక్స్లో నిర్వహించిన ‘క్రెడాయ్ (Credai) ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షో’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ అభివృద్ధికి ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని భట్టి విక్రమార్క తెలిపారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రూ.1,950.52 కోట్లు, మెట్రో వాటర్ బోర్డు (HMWSSB) కోసం రూ.12,500 కోట్లు, హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో రూ.4,336.5 కోట్లు కేటాయించారు.
నగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అభివర్ణించారు. దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రజలందరికీ ఒకే విధమైన పౌర సేవలు మరియు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ (H-CITI) కింద రూ.7,032 కోట్లతో 45 ఫ్లైఓవర్లు, అండర్పాసులు, 10 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు వివరించారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రూ.1,090 కోట్లతో ట్రాఫిక్ నియంత్రణ పనులు, ఐఐఐటీ (IIIT), ఖాజాగూడ వద్ద రూ.837 కోట్లతో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఉత్తర భాగంలో ఆర్మీ ఆర్డినెన్స్ సెంటర్ వద్ద రూ.960 కోట్లు, తూర్పున టీకేఆర్ కాలేజీ మరియు మండమల్లమ్మ జంక్షన్ వద్ద రూ.416 కోట్లు, దక్షిణ భాగంలో రోడ్డు విస్తరణకు రూ.863 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’లో భాగంగా CURE–PURE–RARE వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. వరదల నివారణ కోసం సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నామన్నారు. పర్యావరణ హితంగా ‘బ్లూ-గ్రీన్ మాస్టర్ ప్లాన్’ మరియు గ్రీన్ బిల్డింగ్స్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్టా (UMTA) ద్వారా సమగ్ర మొబిలిటీ ప్లాన్ను రూపొందించి, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ కేవలం ఫ్లైఓవర్ల నగరం మాత్రమే కాదని, పారదర్శకమైన పాలన, సామాజిక సౌహార్దానికి నిలయమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే ఎన్నికల బిజీలోనూ తాము ఈ ఎగ్జిబిషన్కు హాజరయ్యామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల మార్గనిర్దేశంలో కలిసి హైదరాబాద్ను నిజంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని డిప్యూటీ సీఎం తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సదాసిద్ధంగా ఉందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల బిజీ ఉన్నప్పటికీ తనతో పాటు సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరు అయ్యాము అంటే ఈ రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఎలాంటిదో స్పష్టం అవుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Read Also: జనవరిలో ఎక్కువ మంది.. సెర్చ్ చేసిన వాషింగ్ మిషన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే!