Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటు, స్థలాల కేటాయింపులో జరుగుతున్న రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందించారు.
కేంద్రీయ విద్యాలయం వివాదం
కనెక్టివిటీ, అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతోనే కేంద్రీయ విద్యాలయానికి చల్ గల్లో ప్రతిపాదనలు పెట్టామని అరవింద్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి స్కూళ్లకు 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంటే, జగిత్యాల ఎమ్మెల్యే మాత్రం కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఇప్పించారని మండిపడ్డారు. ఈ ప్రతిపాదన కచ్చితంగా రిజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఎమ్మెల్యే కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. స్థలం ఇంకా ఖరారు కాకముందే టెండర్లు, బడ్జెట్ ఎలా ఫైనల్ అయ్యాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్యే అహంకారం , అడ్డంకుల వల్లే విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరం వృథా అయిందని, రెండేళ్లు ఆలస్యమైనా మంచి స్థలంలోనే స్కూల్ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డిపై ఘాటు ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక స్థితిగతులు , నిధుల లభ్యతపై ఎంపీ అరవింద్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి నిధులు అడుక్కుంటున్నాడని, అసలు ఆయన దగ్గర రాష్ట్ర అభివృద్ధికి పైసలు ఎక్కడివని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కాకముందు ఉన్న ఆస్తుల కంటే, తనకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు కనీస బుద్ధి లేదని విమర్శిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కనీస వసతులు కూడా కల్పించలేకపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు, పోలీస్ శాఖపై విమర్శలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కు టికెట్లు అమ్ముకున్నారంటూ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్లే రెండు ఎకరాల కాగితాలు తెచ్చాడని ఎద్దేవా చేశారు. సంజయ్ కుమార్ ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అలాగే పోలీస్ శాఖ తీరుపై మండిపడుతూ.. ఐపీఎస్ చదివి కాంగ్రెస్ రంగు పూసుకుంటే కుదరదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ సభలకు అనుమతులిచ్చి బీజేపీకి ఎలా రిజెక్ట్ చేస్తారని ఎస్పీని ప్రశ్నించారు. పార్టీకి నష్టం చేసే అధికారులకు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read:చెన్నూరులో దారుణం.. స్నేహితుడితో కలిసి భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త!