Dharmapuri Arvind: నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. అక్రమ ఓటర్లు, జిల్లా అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అక్రమ ఓటర్లపై ఉక్కుపాదం..
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఇకనైనా మన దేశం వదిలి వెళ్లిపోవాలని ఎంపీ అరవింద్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ నకిలీ పత్రాలతో (ఫేక్ ఐడీలతో) ఓటర్ కార్డులు పొందిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు కల్పించిన దొంగ ఓట్లన్నీ త్వరలోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు. దేశ భద్రత, సమగ్రత కోసం భారతీయులంతా సీఏఆర్ (CAR) ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
మాధవనగర్ ఫ్లై ఓవర్ డిజైన్ మారినప్పటికీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని అరవింద్ మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాకు కేవలం రెండు గూడ్స్ షెడ్లు మాత్రమే రాగా, ఇప్పుడు తన హయాంలో మరొకటి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తాము ప్రతిపాదించిన స్థలానికే ఆమోదం లభించిందని తెలిపారు.
Also Read: మెదక్లో సినిమా స్టైల్ కిడ్నాప్.. నాలుగు కార్లలో వచ్చి నవవధువును ఎత్తుకెళ్లిన బంధువులు!
కేసీఆర్ అప్పులు.. రేవంత్ రెడ్డి వైఫల్యాలు
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని అరవింద్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేకనే.. పదే పదే కేసీఆర్ చేసిన అప్పుల గురించిన ప్రస్తావన తెస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంపై, ముఖ్యంగా కవిత చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నివేదిక వచ్చినప్పటికీ రేవంత్ సర్కార్ కేవలం కమీషన్ల కోసమే జాప్యం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాటు కాలయాపన చేసి, ఇప్పుడు సీబీఐకి అప్పగించామంటూ బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
Also Read: రన్నింగ్ ఫ్లైట్ నుంచి దూకి ఇన్స్ట్రక్టర్ ఆత్మహత్య.. ఆ తర్వాత ఆకాశంలో ఏం జరిగింది?
కేంద్రానికి ఇవ్వాల్సిన ధాన్యంపై నిలదీత
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సరఫరా చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఈ ధాన్యం కోసం కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా ఎదురుచూస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత పెరుగుతోందని, రానున్న రోజుల్లో వందకు వంద శాతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.