Big Stories

Telangana : తెలంగాణలో భిన్నవాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..

Telangana weather news today(Latest news in telangana): తెలంగాణలో భిన్నవాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు దంచేస్తున్నాయి. మరోవైపు అకస్మాత్తుగా వర్షం ముంచెత్తుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఎల్బీ నగర్‌, కొత్తపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ వర్షం పడింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి.

- Advertisement -

మరోవైపు వచ్చే 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో వానలు కురుస్తాయని చెప్పింది. పలుచోట్ల ఈదురుగాలులతోకూడిన వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.

- Advertisement -

మరోవైపు రాష్ట్రం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అనేక జిల్లాల్లో మిట్టమధ్యాహ్నం వేడి సెగలకు ప్రజలు అల్లాడుతున్నారు. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌ సమీప జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంది. నల్గొండ జిల్లా నిడమనూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దామరచర్ల, హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మోతె మండలాలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం అర్బన్‌, ముదిగొండ, బాణాపురంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News