Telangana Congress: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వంలో నామినేటెడ్ రూపంలో పదవులు పొందిన వారు ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో రావడం లేదని స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్ లో కనిపించకుండా తిరుగుతున్నారనే విమర్శలు సాక్షాత్తు గాంధీభవన్ నుంచే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో కొందరు నేతలు ప్రజల మనిషిగా గుర్తింపు ద్వారా పదవులు తెచ్చుకోగా, మరికొందరు ‘రాజకీయ సమీకరణాల వల్ల పదవులు పొందుతుంటారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఇద్దరు ఫైర్ బ్రాండ్ మహిళా నేతల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. సీనియర్ రాజకీయ మహిళా నేతలుగా పేరొందిన రేణుకా చౌదరి, విజయశాంతిలపై కాంగ్రెస్ పార్టీ కేడర్ గుర్రుగా ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ రూపంలో పదవులు పొందిన ఆ ఇద్దరు మహిళా నేతలు కనీసం గాంధీభవన్ మెట్లు కూడా సరిగ్గా ఎక్కడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జనాల్లో తిరగలేని వారికి, పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ లకు ఆశించిన స్థాయిలో రాని నేతలకు పదవులు ఎందుకు అనే విమర్శలు ఇప్పుడు గాంధీభవన్ వేదికగా వస్తున్నాయి.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకువచ్చేందుకు చాలా మంది నేతలు కష్టపడ్డారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో మంది పై కేసులు కూడా పెట్టారు. ఇవన్నీ తట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తపనతో వేలాది మంది ముఖ్య నాయకులు నిర్వీరామంగా శ్రమించారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా లీడర్లలో కొందరికి ఇప్పటికీ పదవులు రాలేదు. నామినేటెడ్ రూపంలో ని కొన్ని పదవులను ఈక్వేషన్స్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేసింది. ఆ రూపంలోనే రేణుకాచౌదరి, విజయశాంతిలకు పదవులు వచ్చాయనే చర్చ కాంగ్రెస్ కార్యకర్తల్లో జరుగుతుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పోరాడిన నాయకులను పక్కన పెట్టి, సామాజిక సమీకరణాలు ,జాతీయ స్థాయి పరిచయాల ప్రాతిపదికన వీరికి పదవులు దక్కాయనేది అభిప్రాయాలు నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆ పదవులు వచ్చిన తర్వాత సరైన స్థాయిలో సమర్థవంతంగా పనిచేయడం లేదనేది ఇప్పుడు బిగ్ డిస్కషన్ గా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేణుకాచౌదరికి రాజ్యసభ పదవి వరించింది. సీనియారిటీ, వాక్చాతుర్యం ,ఢిల్లీ స్థాయిలో ఉన్న పట్టుతో నే ఆమెకు రాజ్యసభ సీటు దక్కిందని పార్టీలో చర్చ జరుగుతుంది. పైగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న మహిళా నేత కావడంతో పదవి వచ్చిందచే చర్చ కూడా ఉన్నది. అయితే గతంలో ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆమె కార్యకలాపాలు పెద్దగా లేవని పార్టీలో డిస్కషన్. ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ‘స్టార్’ హోదాతో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి ప్రభుత్వంలో లక్కి ఛాన్స్ వచ్చింది. నామినేటెడ్ రూపంలో ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బీసీ మహిళా నేతగా ఆమెకు ఢిల్లీలో గుర్తింపు ఉన్నది. అంతేగాక ఏఐసీసీ అగ్రనేత సోనియ గాంధీతో అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. దీంతోనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే చర్చ ఉన్నది.
ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక. కానీ, పదవులు పొందిన ఈ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడంపై క్షేత్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది . పదవులు వచ్చాక కనీసం పార్టీ కార్యక్రమాలు, ప్రజలు, కార్యకర్తలతో మమేకం కాకపోవడాన్ని కేడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఈ ఇద్దరు మహిళా నేతల తీరుపై పార్టీలోనే అంతర్గత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక జూనియర్ నేతలను కలుపుకుని పోవడంలో గానీ, స్థానిక సమస్యలపై స్పందించడంలో గానీ వీరిద్దరూ విఫలమవుతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇక పదవులు పొంది పార్టీ ప్రోగ్రామ్స్ కు రాని వాళ్లతో ఎలాంటి ప్రయోజనాలు లేవని కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ లాంటి యువ నాయకులకు ఈ పదవులు ఇచ్చినా..పదేళ్ల ప్రభుత్వ టార్గెట్ లో తమవంత పాత్రను క్రియాశీలకంగా పోషించే వాళ్లమని ఓ యువ నాయకుడు తెలిపారు.
Also Read: Free Bus: ఇక పై వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. జీవో జారీ చేసిన సర్కార్..!