Siddipet: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఈరోజు జరిగిన 77వ గణతంత్ర వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న పొరపాటు రాజకీయ ఘర్షణగా మారి.. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
దుబ్బాకలోని గాంధీ చౌక్ వద్ద రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే.. ఆ సమయంలో అజాగ్రత్త వల్ల జెండా తలకిందులుగా ఎగిరింది. జెండా తలకిందులుగా ఉండటాన్ని గమనించిన స్థానికులు , కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎమ్మెల్యే వ్యవహరించారని వారు మండిపడ్డారు.
జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు ‘జై కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేయగా.. దానికి ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ‘జై బీఆర్ఎస్’ అంటూ పోటీ నినాదాలకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి, పరస్పరం నెట్టుకుంటూ బాహాబాహికి దిగారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించారు. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను విడదీసి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. జాతీయ పండగ రోజైన గణతంత్ర దినోత్సవం నాడు రాజకీయ విమర్శలు, తోపులాటలు జరగడం పట్ల స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాగ్రెంస్ నేతలు దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ALSO READ: హుస్నాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి బాటలు.. సీసీ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు https://t.co/YE2XNLCPjL pic.twitter.com/p5BzabU0Kt
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2026