Kavitha – EC: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఊహించని షాక్ ఇచ్చింది. ఈ పేరును మార్చుకోవాలంటూ స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాశారు.
తెలంగాణలో గతంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) పార్టీ పేరును కాలక్రమేణా ‘భారత రాష్ట్ర సమితి’ (BRS)గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే కవిత ఇప్పుడు ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’కు కూడా షార్ట్ ఫామ్ ‘TRS’ అనే వస్తుంది. ఒకే రకమైన సంక్షిప్త పేరు (Abbreviation) ఉండటం వల్ల ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ భావించింది. దీంతో ఆ పేరు మీద కొత్త పార్టీ రిజిస్ట్రేషన్కు నిరాకరించినట్లు తెలుస్తోంది.
పార్టీ పేరు మార్పుకు సంబంధించి.. కవితకు 15 రోజుల డెడ్ లైన్ ను ఈసీ విధించింది. ఆలోపు మూడు ప్రత్యామ్నాయ (Alternative) పేర్లను తమకు సమర్పించాలని లేఖలో ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరించింది.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. హోంశాఖలో భారీ ఉద్యోగాల జాతర!
ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన కవితకు ఈసీ నిర్ణయం బ్రేక్ వేసినట్లయింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాల ప్రకారం ఆమె ‘TRS’ కాకుండా ప్రత్యామ్నాయంగా ఎలాంటి పేర్లను ఎంపిక చేయబోతున్నారు? 15 రోజుల గడువులోగా ఈసీకి ఏ పేర్లను పంపనున్నారు? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అయితే ‘టీఆర్ఎస్’ పేరుతో కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. తమ పార్టీ మూలాలతో ముడిపడి ఉన్న ‘TRS’ పేరును.. ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీకి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు అనుమతి ఇస్తే.. ఓటర్లలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇందులోని నిజానిజాలు సమీక్షించుకొని ఈసీ కవితకు తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.
Also Read: మీ పిల్లాడు ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడా? తల్లిదండ్రులు వెంటనే జగ్రత్త పడాలి