ED On Betting Apps: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందా? కేవలం తెలుగు సెలబ్రిటీలు కాకుండా రాజకీయ నేతలు ఉన్నారా? ఎందుకు ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది? మనీ లాండరింగ్ రూపంలో చెల్లింపులు జరిగాయా? పోలీసుల నుంచి వివరాలు ఈడీ తీసుకునేందుకు కారణమేంటి? ఇలాంటి ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
బెట్టింగ్ యాప్లో కొత్త కోణం
బెట్టింగ్ యాప్ వ్యవహారం యూట్యూబర్లు, కొందరు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు తెప్పించుకుని దర్యాప్తులో నిమగ్నమైంది. తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి నాలుగు ఫార్మ్ హౌస్ల కేంద్రంగా భారీగా బెట్టింగ్ యాప్స్ దందా నడిచినట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు
చైనా నుండి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు సమాచారం. ఆ నేత ఫార్మ్ హౌస్ కేంద్రంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లావాదేవీలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా శంకరపల్లి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మేడ్చల్ ఫార్మ్ హౌస్ కేంద్రంగా ఈ దందా నడిపారని తెలుస్తోంది. ప్రమోషన్ చేసిన వారికి చెల్లింపులు మాజీ మంత్రి అనుచరులు మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రి అండతో హైదరాబాద్ కేంద్రంగా ఏడాదికి రూ. 1200 కోట్లు మేరా లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాగానే సదరు మంత్రి, ఆయన అనుచరులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతున్నారట ఆ నేత అనుచరులు.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు
విచారణకు కొందరు ఎస్కేప్
మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. యాప్స్ను ప్రమోట్ చేసిన కొంతమందిపై ప్రత్యేక దృష్టి సారించారు. విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు చాలామంది డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. తమకు కొంత సమయం కావాలని కోరినట్టు పోలీసు వర్గాల మాట. అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
మూలాల్లోకి ఈడీ
ఈ క్రమంలో పోలీసుల విచారణకు వెళ్లాలా వద్దా అనే డైలామాలో పడిపోయారు నోటీసులు అందుకున్న వ్యక్తులు. బెట్టింగ్ యాప్స్ గురించి రకరకాల వార్తలు రావడంతో ఈడీ అటువైపు దృష్టి సారించింది. ప్రమోట్ చేసిన యూట్యూబర్ల గురించి ఆరా తీసిందట ఈడీ. ముఖ్యంగా వాళ్లకు జరిగిన చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ చేసింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలని వారికి ఎవరు చెప్పారు? ప్రమోషన్ చేసినందుకు నిధులు ఏ రూపంలో ఇచ్చారు? ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేశారా? బెట్టింగ్ యాప్ మూలాలు ఎక్కడ? యాప్ వెనుక ఇన్వెస్టర్లు ఎవరు? దేశీయంగా ఉన్నారా? చైనా ప్రమేయం ఏమైనా వుందా? అనేదానిపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టేశారు.
నమోదైన కేసుల ఆధారంగా 11 మంది వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో నగదు చెల్లింపులు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొత్తానికి బెట్టింగ్ యాప్లో తీగ లాడితే డొంక ఎవరెవరు సెలబ్రిటీలు, నేతల మెడకు చుట్టుకుంటుందో చూడాలి.