Farmhouse Case: ఫాం హౌజ్ డ్రగ్స్ , కాల్పుల కేసులో సిట్ (SIT) విచారణ అత్యంత వేగంగా కొనసాగుతోంది. మొదటి రోజు విచారణలో భాగంగా నిందితులను దాదాపు 9 గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఈ విచారణను ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు.
విచారణలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు సరిగ్గా సహకరించడం లేదని సమాచారం. ఫాం హౌజ్లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమేనని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు, కాల్పుల ఘటనపై గన్మెన్ నమిత్ శర్మ విస్తుపోయే నిజాలు వెల్లడించారు. లోపలికి వచ్చింది పోలీసులని తనకు తెలియదని, భాషా సమస్య వల్ల వారిని ఎవరో దాడులు చేయడానికి వచ్చిన వారుగా భావించి కాల్పులు జరిపానని పేర్కొన్నారు. రితేష్ రెడ్డి ‘హమ్ దేక్ లేతే.. తూ ఫైర్ కరో’ (మేం చూసుకుంటాం.. నువ్వు కాల్పులు జరుపు) అని చెప్పడం వల్లే తాను కాల్పులు జరిపానని నమిత్ శర్మ వివరించారు.
ఈ కేసులో తాజాగా మరో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరికి కూడా పోలీసులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకోకముందే పార్టీలో ఉన్న ఇతర వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన పోలీసులు, వాటిని నిందితుల ముందు ఉంచి విచారించారు. ముఖ్యంగా అభిషేక్ సింగ్ డ్రగ్ నెట్వర్క్పై సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు.
మొదటి రోజు విచారణ ముగిసిన అనంతరం రోహిత్ రెడ్డి తరపు అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకు తమ సమక్షంలోనే విచారణ జరిగిందని, నిందితులు అందరూ సహకరించారని ఆయన తెలిపారు. నమిత్ శర్మ తిరుమల దర్శనం కోసం వచ్చాడని, దానికి సంబంధించిన టికెట్లను కూడా చూపించామని చెప్పారు. అది కేవలం స్నేహితులతో చేసుకున్న పార్టీ మాత్రమేనని, డ్రగ్స్కు లేదా కాల్పులకు రోహిత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: అమృత్ 2.0 సమీక్షలో ఎంపీ చామల.. హైదరాబాద్ అభివృద్ధి ఫైళ్లపై కీలక చర్చ