First Day of Medaram Jatara 2024: భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర ప్రారంభమైంది. తొలి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనమంతా జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి ఆదివాసీ పూజారులు సారలమ్మ అమ్మవారిని డోలు, వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు.
సారలమ్మను కొలువుదీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది. అంతకన్నా ముందు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధిచేసి, ముగ్గులు వేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్కతోపాటు, కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శబరీశ్ కన్నెపల్లికి చేరుకున్నారు. అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం 7 గంటల 41 నిమిషాలకు సారలమ్మ ప్రతిరూపమైన మొంటెతో పూజారులు మేడారం బయల్దేరారు. వనదేవతల దీవెనల కోసమై.. ఆలయ ప్రాంగణంలో వరంపట్టిన మహిళలు, భక్తులు.. నృత్యాలతో వారికి స్వాగతం పలికారు.
Read More: రుణాల పేరుతో మోసం.. 12 మంది అరెస్ట్..
వేలాది మంది ఆదివాసీ యువత, భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు. కన్నెపల్లి వాసులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఆదివాసీలు సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు. వనదేవతల ఊరేగింపు జంపన్న వాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులుతీరారు. అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా.. అక్కడి పూజారులు ఆహ్వానం పలికారు. పూజలు నిర్వహించిన అనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలకు గద్దెలపై ప్రతిష్ఠించారు.
జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం పరిసరాలు.. వనమా? జనమా అన్నంతగా మారిపోయాయి. వేలాది మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులుదీరడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం నేడు జరగనుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Read More: “రష్యాలో హైదరాబాదీలను రక్షించాలి”.. జయశంకర్కు ఒవైసీ ట్వీట్..
మరోవైపు.. మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. జాతర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరన్న ప్రధాని.. ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.