New Sarpanch Initiative: గ్రామ పాలన అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత, భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వడమే నిజమైన నాయకత్వం. ఈ ఆలోచనకు అద్దం పట్టేలా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో.. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన తొలి సంతకం గ్రామ చరిత్రలోనే కాదు, సమాజంలోనూ ఓ ఆదర్శంగా నిలిచింది.
నర్సింహునిపేట గ్రామంలో నూతన సర్పంచ్గా ఎన్నికైన సంధి రాజమణి, మల్లారెడ్డి దంపతులు, గ్రామ అభివృద్ధిని కొత్త కోణంలో ఆలోచిస్తూ ముందడుగు వేశారు. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడపిల్లల పేరున రూ.5,000 చొప్పున డిపాజిట్ చేయడమే తన తొలి సంతకమని ప్రకటించారు. ఈ నిర్ణయం గ్రామస్తుల్లో అపూర్వమైన స్పందనను తెచ్చిపెట్టింది.
గ్రామంలో ఇకపై ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి.. రూ.5,000 డిపాజిట్ అందించే పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ డిపాజిట్ ద్వారా ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, లింగ వివక్షను తగ్గించి, ఆడపిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలనే ఉద్దేశం ఉందని సర్పంచ్ తెలిపారు.
అంతేకాకుండా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనే దృఢ సంకల్పంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరే ప్రతి విద్యార్థికి రూ.10,000 చొప్పున డిపాజిట్ అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే కేవలం భవనాలు కాదు, విద్యార్థులకు ప్రోత్సాహం అవసరమని సర్పంచ్ రాజమణి పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ డిపాజిట్ పథకం ప్రారంభించామని తెలిపారు. విద్య అనేది గ్రామ అభివృద్ధికి పునాది అని, చదువుకున్న తరం నుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాలు ఎన్నికల హామీల్లో భాగమేనని, గ్రామానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే తొలి సంతకం ఈ పథకాలపై చేశామని సర్పంచ్ దంపతులు వెల్లడించారు. పాలన అనేది మాటలతో కాకుండా పనితో చూపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Also Read: తేల్చిచెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి
నర్సింహునిపేటలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాలు ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఆడపిల్లల సంక్షేమం, ప్రభుత్వ విద్యకు ప్రోత్సాహం వంటి అంశాల్లో నర్సింహునిపేట గ్రామం ఒక ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు. గ్రామస్తులు సర్పంచ్ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి పాలనతో గ్రామం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.