Forensic Lab Fire: స్వేచ్ఛ బ్యూరో: ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగిన అగ్ని ప్రమాదం మరో మలుపు తీసుకుంది. ఈ దుర్ఘటనలో 11వందల ఫైళ్లు కాలి బూడిదైనట్టు నిపుణులు నిర్ధారించారు. వాటి డేటాను రిట్రైవ్ చేయటం కూడా సాధ్యం కాదని తేల్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లి రెడ్ హిల్స్ లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ లో ఈనెల 7న ఉదయం 10గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంట్లో కంప్యూటర్ ల్యాబ్ తోపాటు హార్డ్ డిస్కులు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. వీటిల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన వాటితోపాటు ఓటుకు నోటు కేసులోని కీలక పత్రాలు అగ్నికి ఆహుతైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజకీయ కోణంలో ఆయా పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ ఓటుకు నోటు కేసులోని అన్ని ఆధారాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని, వాటికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్ తోపాటు, కొన్ని హార్డ్ డిస్కులు, ఫైళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. నాగ్ పూర్ లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజీ నుంచి నిపుణులను రప్పిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ నిపుణులు వస్తున్నట్టు చెప్పారు. ఈ బృందాలు విచారణ జరిపి ప్రమాదం ఎలా జరిగిందన్నది నిర్ధారించటంతోపాటు డేటాను రిట్రైవ్ చేస్తారన్నారు. ఇక, హైదరాబాద్ వచ్చిన నాగ్ పూర్ స్పెషల్ టీం తాజాగా కీలక వివరాలను వెల్లడించింది. ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11వందల ఫైళ్లు కాలి బూడిదైనట్టు తెలిపింది. వాటి డేటాను రికవరీ చేయటం సాధ్యం కాదని తేల్చేస్తూ ఈ మేరకు నివేదికను సమర్పించింది. కాగా, దగ్ధమైన ఫైళ్లలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా సమాచారం.
Also Read: Pixel Phones Discount: సగం కన్నా తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ ఫోన్.. అమెజాన్లో షాకింగ్ ఆఫర్స్
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నేరాల పరిశోధనలో ఎఫ్ఎస్ఎల్ తనదైన పాత్రను పోషిస్తుంది. హత్యలు, దోపిడీలు, మోసాలు, లైంగిక దాడులతోపాటు పలు నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఇక్కడే విశ్లేషించి భద్రపరుస్తారు. నేరాలు జరిగిన చోటు నుంచి సేకరించిన నమూనాలు, సాంకేతిక ఆధారాలను ఈ ల్యాబ్ లోనే పరీక్షించి నివేదికలు తయారు చేస్తారు. డీఎన్ఏ టెస్టులు, వేలిముద్రలు, రక్తం, వెంట్రుకల నమూనాలను కూడా ఇక్కడే విశ్లేషించి రిపోర్టులు రూపొందిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో 11 వందల ఫైళ్లు దగ్ధమైనట్టు వెల్లడైన నేపథ్యంలో ఏయే కేసులకు సంబంధించిన ఆధారాలు వాటిల్లో ఉన్నాయన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది. కాగా, ఆయా కేసులపై ఈ పరిణామం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Neknampur Lake: అద్దంలా మెరవనున్న నెక్నామ్ పుర చెరువు.. రూ 99.50 కోట్లతో అభివృద్ధి పనులు