Boda Janardhan joins TRS party: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. త్వరలోనే భారీ అనుచరగణంతో కలిసి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు బోడ జనార్దన్ ప్రకటించారు.
బోడ జనార్దన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంపై బోడ జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో గని కార్మికుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యం సింగరేణి బెల్ట్ లో పార్టీ పునాదులను పటిష్టం చేసేందుకు దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.
బోడ జనార్దన్ వంటి సీనియర్ నేత పార్టీలోకి రావడం పట్ల కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన నాయకుల సలహాలు.. సూచనలు పార్టీ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కేడర్ ను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఆమె సూచించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జనార్దన్ రాకతో టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: కవిత కొత్త పార్టీ పేరు రాష్ట్ర సేన కాదు.. అసలు పేరు తెలిస్తే షాక్ అవుతారు!