Farmhouse Rules: స్వేచ్ఛ బ్యూరో: ఫార్మ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ల నిర్వాహకులు హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. వీటి యజమానులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, చట్టపరమైన నిబంధనలను అనుసరించాలని చెప్పారు. చేవెళ్ల జోన్లోని ఫార్మ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల నిర్వాహకులతో శనివారం మొయినాబాద్లోని వుడ్ ల్యాండ్స్ రిసార్ట్లో సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఫుటేజీని కనీసం ముప్పయి రోజులపాటు బ్యాకప్ రూపంలో భద్రపరచాలని చెప్పారు. అవసరమైనపుడు ఫుటేజీని పోలీసులకు అందించాలన్నారు. ఇక, అతిధుల పేర్లు, ఇతర వివరాలను ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రతీ ఒక్కరి నుంచి ఐడీ కార్డు ప్రూఫ్ ను తీసుకుని భద్రపరచాలన్నారు. ఆన్లైన్ గెస్ట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా అమలు చేయాలి.
ఈ సందర్భంగా అతిథుల వివరాలను సులభంగా నమోదు చేసేందుకు, భద్రతను బలోపేతం చేసేందుకు ‘సేఫ్ అతిధి’ యాప్ ను ప్రారంభించారు. యజమానులు ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. తల్లిదండ్రులు లేకుండా మైనర్లకు ఫార్మ్ హౌస్లు, రిసార్ట్స్లో ప్రవేశం కల్పించవద్దని చెప్పారు. ఫార్మ్ హౌస్ లలో నిర్వహించే కార్యక్రమాలు, ఈవెంట్లకు అవసరమైన అన్ని చట్టపరమైన అనుమతులను ముందుగానే తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మ్ హౌస్ లలో రేవ్, డ్రగ్స్, హుక్కా పార్టీలు నిర్వహించ వద్దని చెప్పారు. చట్టవిరుద్ధంగా బర్త్డే, ఇతర వేడుకలు జరపవద్దని తెలిపారు. జూదం, మానవ అక్రమ రవాణా సంబంధించిన కార్యకలాపాలకు అవకావం ఇవ్వొద్దని చెప్పారు.
Also read: Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!
ఫార్మ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్లలో నేరాల నివారణ కోసం ఈగిల్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, స్థానిక పోలీస్ స్టేషన్ల సీఐలు, సెక్టర్ ఎస్ఐలు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యజమానులు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేస్తూ తమ ప్రాంగణాలను నేరరహితంగా, సురక్షితంగా నిర్వహించాలన్నారు. సందర్శకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ మల్లికార్జున్ రెడ్డి, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, షాబాద్ సీఐ కాంతా రెడ్డి, శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డితోపాటు 750మందికి పైగా ఫార్మ్ హౌస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
Also read: Show Cause: కాంగ్రెస్లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!