Gaddar daughter : తన పాటనే తుపాకీగా, తన మాటనే తూటాలా.. రాజ్య హింసపై కదంతొక్కిన వ్యక్తి గద్దర్. ఆయన సేవలకు, ప్రజా కార్యక్రమాలకు గుర్తుగా.. ప్రజా యుద్ధనౌక అంటూ సంబోదిస్తుంటారు. అలాంటి గద్దర్ వారసురాలు.. వెన్నెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. పాట అనే సాంస్కృతిక వేదిక ద్వారా ఉద్యమాలకు ఊపిరిలూదిన నేత సేవలకు గుర్తుగా… ఆయన కూతురుకు అదే విభాగంలో సేవలందించే అవకాశం కల్పించింది.
గద్దర్ వారసురాలిగా.. రాజకీయాల్లోకి వచ్చిన వెన్నెలను ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో గద్దర్ అభిమానులు, సాంస్కృతిక వేదికతో సంబంధాలున్న అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరైన వ్యక్తికి.. సరైన విభాగంలోని బాధ్యతలు అప్పగించారని ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయంతో.. ఓ వైపు సాంస్కృతిక రంగానికి ఏం చేయాలో చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్న వ్యక్తిని నియమించారనే సంతృప్తితో పాటు.. ప్రజాభిమాన గాయకుడికి నివాళులు అర్పించినట్లైందని అంటున్నారు.
గద్దర్ సేవల్ని గుర్తిస్తూ.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే.. ఏటా సినిమాకు అందించే అత్యుత్తమ పురస్కారాలైన నంది అవార్డులకు.. గద్దర్ పురస్కారాలుగా పేరు మార్చి గౌరవించింది. హైదరాబాద్ లోని తెల్లాపూర్ పరిధిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, గద్దర్ పై అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు.. ఆయన వారుసురాలికి మంచి పదవి ఇచ్చి.. మరోసారి సత్కరించుకుంది.
తెలంగాణ సాంస్కృతి సారథి ఛైర్ పర్స్ గా ఎంపికైన వెన్నెల.. గతంలో కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్న వెన్నెలకు.. ఇప్పుడు ఈ పదవిని కట్టబెట్టారు.
Also Read : రాష్ట్రంలో ప్రతిపక్షం ఫామ్ హౌస్ కే పరిమితమైంది.. పీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలనం!
గతంలో ఎప్పుడూ పార్టీలకు మద్ధతు ప్రకటించని గద్దర్.. తన జీవిత చరమాంకంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు. భారత్ జోడ్ యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి సమక్షంలో రాహుల్ గాంధీని కలిసిన గద్దర్.. ఆ తర్వాత పార్టీ కోసం పాటలు రాసి, పాడురు. అప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని గద్దర్.. చివర్లో మాత్రం ఎన్నికల్లో నిలబడాలని కోరుకున్నారు. కానీ.. అది నెరవేరకుండానే చనిపోయారు. ఆయన మరణించినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి వచ్చి గద్దర కుటుంబాన్ని పరామర్శించారు.