TGPSC-2026: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వేగం పెంచేందుకు రెడీ అవుతోంది టీజీపీఎస్సీ. వచ్చే వారం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతికత వినియోగాన్ని పెంచుతామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. దీంతో నిరుద్యోగుల్లో ఒకటే ఆనందం. పాత పుస్తకాలను తిప్పే పనిలోపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్వయంగా వెల్లడించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఛైర్మన్ బుర్రా వెంకటేశం శనివారం ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉద్యోగులతో మాట్లాడిన ఆయన, టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అన్నారు.
అందుకే ప్రతి నిర్ణయాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. నియామక ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం వేలాది మంది అభ్యర్థులపై పడే అవకాశం ఉందన్నారు. పరీక్షల నిర్వహణలో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. నోటిఫికేషన్ మొదలు, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఫలితాల ప్రకటన వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. నియామక ప్రక్రియలో సాంకేతికత వినియోగం, డిజిటల్ విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్రెడ్డి. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో నిరుద్యోగులు ఎలాంటి వదంతులను నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధంకావాలని సూచన చేశారు. అటు టీజీపీఎస్సీ కూడ వరుస నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగుల్లో ఆశలు క్రమంగా పెరుగుతున్నాయి.
ALSO READ: చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?