State Topper: స్వేచ్ఛ బ్యూరో: కడుపేద కుటుంబం తండ్రి లేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలే ఆధారం అయినా పట్టుదలతో చదివి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది కమలాపూర్ మండలానికి చెందిన కోరే వైష్ణవి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల (ఎం.జె.పి) పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కోరే వైష్ణవి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన వైష్ణవి చిన్నప్పటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ చదువులో ప్రతిభ కనబరిచింది. తండ్రి లేకపోయినా తల్లి సంధ్యారాణి కష్టపడి చదివించగా వైష్ణవి పట్టుదలతో ఈ ఘనత సాధించింది.
వైష్ణవి పదవ తరగతిని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేసి ప్రస్తుతం ఎం.జె.పి బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పట్ల గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ వైష్ణవిని అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు. కష్టపడి చదివి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కడుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని రాష్ట్ర ప్రథమంగా నిలవడం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Also read: నవ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్రసంగానికి పార్లమెంటు ఫిదా…
అదేవిధంగా కురుమ సంఘం సభ్యులు వైష్ణవిని శాలువాతో సత్కరించి నగదు ప్రోత్సాహం అందించారు. ఒకటో వార్డు సభ్యురాలు మార్క సరిత వైష్ణవిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు వైష్ణవిని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టాలను అధిగమించి పట్టుదలతో చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని వైష్ణవి మరోసారి నిరూపించింది.
Also read: ఫుట్ పాత్ పై సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. మార్కింగ్ పడితే కూల్చివేత పక్కా..!