Dowry Harassment: స్వేచ్చ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో సోమవారం కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ తన తల్లిదండ్రులు బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
బాధితురాలు శ్రీజ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు సంవత్సరాల క్రితం గుండేడు గ్రామానికి చెందిన డెంగు రాజుతో తన వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపింది. వివాహ సమయంలో ఒప్పుకున్న కట్నాన్ని తమ కుటుంబ సభ్యులు ఇచ్చారని, అయితే పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం తనను వేధించడం ప్రారంభించారని ఆరోపించింది. హైదరాబాద్లో కలిసి నివసించిన సమయంలో తనపై శారీరక వేధింపులు జరిగేవని అనంతరం వ్యవసాయ పనుల కారణంగా గ్రామంలోనే ఉండాలని చెప్పి తనను హైదరాబాద్కు తీసుకెళ్లలేదని పేర్కొంది. గ్రామంలో ఉన్న సమయంలో అత్తింటి వారి నుంచి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
Also read: ‘హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!
గత రెండేళ్లుగా తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడని, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆరోపించింది. కుటుంబ పెద్దల సమక్షంలో పలుమార్లు సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆమె తెలిపింది. దీంతో తన తల్లిదండ్రులు బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి భర్త, ఆయన కుటుంబ సభ్యుల స్పందన అందుబాటులోకి రాలేదు. ఘటనపై ఫిర్యాదు అందితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపినట్లు సమాచారం.
Also read: DSP Promotions: సీఐలను డీఎస్పీలుగా బదిలీ చేస్తూ.. సీ.వీ.ఆనంద్ ఆర్డర్స్ జారీ..!