Harish Rao: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ, క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఆన్లైన్ విధానం, లైవ్ ఫోటోలు
ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అత్యంత ఆధునికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పూర్తి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సభ్యత్వం తీసుకునే సమయంలోనే స్పాట్లో లైవ్ ఫోటో సేకరించడంతో పాటు, ఓటరు వివరాలను కూడా అక్కడే నమోదు చేయనున్నారు. ఈ డిజిటల్ డ్రైవ్లో భాగంగా సాధారణ సభ్యత్వానికి రూ. 10, క్రియాశీలక సభ్యత్వానికి రూ. 50 రుసుముగా నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని హరీశ్ రావు సూచించారు.
జూన్ మొదటి వారం సభ్యత్వ నమోదు శిక్షణా
ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. ఆన్లైన్ నమోదు విధానంపై నాయకులకు, కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ను విజయవంతంగా పూర్తి చేస్తే.. అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి గట్టి పునాదిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పదికి పది స్థానాలే లక్ష్యం
ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ వల్ల ఇప్పటికే 7 స్థానాలు గెలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే శ్రమించాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు జిల్లా మెంబర్షిప్ ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయడానికి కలిసికట్టుగా కృషి చేస్తామని తీర్మానించారు.
Also Read: చంద్రబాబును మించిపోయిన లోకేష్.. కూటమి సర్కార్పై రోజా విమర్శల వర్షం!