Harish Rao: సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. సిద్దిపేట అభివృద్ధి అంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం తాము కట్టిన భవనాలకు రిబ్బన్లు కట్ చేయడానికి, శిలాఫలకాలపై పేర్లు వేయించుకోవడానికి వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘శ్రమ మాది.. శిలాఫలకం మీది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు.
ముఖ్యంగా రేపు ప్రారంభించబోయే పామాయిల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ.. ఇది 2021లోనే మంజూరైందని, మలేషియన్ టెక్నాలజీతో దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్గా దీనిని తాము తీర్చిదిద్దామని గుర్తుచేశారు. 62 ఎకరాల భూమిని సేకరించి, రైతులకు అవగాహన కల్పించి ఈ ప్రాజెక్టును సాకారం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రాజెక్టు జలాలతో నడిచే ఫ్యాక్టరీని ఏ మొహం పెట్టుకుని ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. ఆ జలాలను నెత్తి మీద చల్లుకుంటే చేసిన పాపాలు పోతాయని హితవు పలికారు.
కేవలం ఫ్యాక్టరీనే కాకుండా, సిద్దిపేట జిల్లా జైలు, ఆయుష్ హాస్పిటల్, సెంట్రల్ డ్రగ్ స్టోర్ వంటి భవనాలన్నీ తన హయాంలోనే పూర్తయ్యాయని హరీష్ రావు వివరించారు. ఇప్పటికే ఓపీ సేవలు అందిస్తున్న ఆయుష్ ఆసుపత్రికి ఇప్పుడు కొత్తగా పలకలు వేయించుకోవడం హాస్యాస్పదమని అన్నారు. సిద్దిపేట అభివృద్ధి కోసం తాము పడ్డ కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలని చూడటం సరికాదని మండిపడ్డారు.
రైతు సంక్షేమం విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ 100 శాతం చేస్తానని దేవుళ్లపై ఒట్టు వేసి ఇప్పుడు వేల మంది రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలోనే 23 వేల మందికి రుణమాఫీ కాలేదని, మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. అలాగే, సిద్దిపేటకు రావాల్సిన వెటర్నరీ కాలేజీని కొడంగల్కు తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంజూరైన రూ. 1070 కోట్ల నిధులను నిలిపివేసి సిద్దిపేటపై కక్ష సాధిస్తున్నారని, దీనిపై సమాధానం చెప్పిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. శిలాఫలకాలపై పేర్లు మారినా, ప్రజల మనసుల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పేరు చిరస్థాయిగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: భార్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్!