రేవంత్ సర్కారు తాజాగా ప్రకటించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ ప్రచార పర్వమని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కొత్త డైవర్షన్ డ్రామాకు తెర తీశారని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఎనిమిది వందల రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి మరో నాటకం ఆడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ఇప్పుడు ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు.. వైఫల్యాలు.. కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కామ్ల నుండి తప్పించుకోవడానికే ఈ ఆర్భాటమని ఎద్దేవా చేశారు.
గతంలో రెండు సార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుండి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ పాత దరఖాస్తులకు దిక్కు లేదు కానీ మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం కావడం సిగ్గుచేటని హరీశ్ రావు అన్నారు. అసలు రెండున్నరేళ్లలో ఏం చేశారని గ్రామసభల్లో ప్రచారం చేసుకుంటారని ఆయన నిలదీశారు.
రైతు భరోసా ఊసే లేదని.. గత సీజన్ పంట బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి గ్రామాల్లో రైతులకు ఏం వివరిస్తారని ఆయన ప్రశ్నించారు. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలన్న హామీని గాలికి వదిలేసి జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్గా మార్చారని దుయ్యబట్టారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారని.. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పట్టించుకోకుండా ఇప్పుడు నైపుణ్య శిక్షణ అంటూ కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు.
ఆసుపత్రుల్లో మందులు లేక.. బడుల్లో వసతులు కరువై.. గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని ప్రభుత్వం తన వైఫల్యాలను తానే ఒప్పుకుంటోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. పారిశుధ్యం.. ఫైళ్ల క్లియరెన్స్ వంటి కనీస బాధ్యతలను కూడా ఒక ఈవెంట్లా కలర్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. గ్యారెంటీలు అందక ఎదురుచూస్తున్న లక్షలాది మంది బాధితుల సంగతి ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్.. పర్యావరణం.. డ్రగ్స్ నియంత్రణ వంటివన్నీ కేవలం పత్రికా పబ్లిసిటీ కోసమే తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న గారడీలను ప్రజలు గమనిస్తున్నారని హరీశ్ రావు హెచ్చరించారు. సంక్షేమాన్ని విస్మరించి ప్రజా పాలన మాటున కొనసాగిస్తున్న దుర్మార్గ పాలనను నిలదీసేందుకు గ్రామగ్రామాన ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: Medak District: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై మంత్రి వివేక్ సమీక్ష..!