Balaraju Goud : మునుగోడులో లచ్చిందేవి నాట్యమాడుతోంది. ఉప ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. ఓటుకు వందో, వెయ్యో ఇచ్చే రోజులు పోయాయి. ఒక్కో ఓటు 10వేలు, 15వేలు పలుకుతోందని టాక్. అయితే, పోలింగ్ కు ముందు రోజే ఓటుకు నోట్లు జేబులో చేరేవి. ఈలోగా తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత. నేతల వెనుక తిరిగితే అది వేరే. ర్యాలీలో పాల్గొంటే ఎంతోకొంత. గిఫ్ట్ లు, దావత్ లకైతే లెక్కేలేదు. మరి, మునుగోడుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రధాన పార్టీలు కోట్లకు కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు? నగదు ప్రవాహం వెనుక ఉన్న హవాలా వీరులెవ్వరు? అనేది ఆసక్తికరం.
మునుగోడుకు వచ్చే డబ్బంతా హైదరాబాద్ నుంచే. హవాలాకు హెవెన్ గా మారింది రాజధాని. నగరంలో పదుల సంఖ్యలో హవాలా ముఠాలు ఉన్నాయి. ఎన్నికల వేళ వారంతా ఫుల్ బిజీ. మంచి కమిషన్ ముడుతుండటంతో ఎంతకైనా తెగిస్తున్నాయి హవాలా గ్యాంగ్ లు. పోలీసులు తనిఖీలు పెంచడంతో భారీగా సొమ్ము పట్టుబడుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ లో ఇటీవల గాంధీనగర్ లో మూడున్నర కోట్లు, జూబ్లీహిల్స్ లో రెండున్నర కోట్లు, బంజారాహిల్స్ లో సుమారు రెండు కోట్లు, సాగర్ రోడ్డులో 1.24 కోట్లు, వెంకటగిరిలో 54 లక్షలు.. ఇలా వరుసగా భారీ మొత్తంలో క్యాష్ దొరికింది. అంతా లెక్కాపత్రం లేని డబ్బే. ఇచ్చింది ఎవరో.. ముట్టేది ఎవరికో.. మధ్యలో దొరికేది మాత్రం మామూలు బ్రోకర్లే.
హైదరాబాద్ తో పాటు మునుగోడులోనూ పోలీసులు తనిఖీలు పెంచారు. ఇటీవల కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త కొత్త కారులో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తుండగా ఖాకీలకు దొరికిపోయాడు. సిటీ శివార్లలో ఓ ఎంపీ బంధువుల కార్లలోనూ కోటికి పైగా నగదు లభించింది. అయితే, అధికార పార్టీ వారికి చెందిన హవాలాను చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణ ఉంది. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల కోసం తరలిస్తున్న నగదుపై మాత్రమే పోలీసులకు సమాచారం వస్తుండటం.. వారి డబ్బే సీజ్ చేస్తుండటం.. అంతా ఓ స్కెచ్ ప్రకారం జరుగుతోందనేది విపక్షం విమర్శ.
హవాలా డబ్బు తరలింపులో హైదరాబాద్ కు చెందిన బాలరాజు గౌడ్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కనుసన్నల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు నగరం నుంచి మునుగోడుకు తరలివెళ్తోందని సమాచారం పోలీసులకు దగ్గర ఉందంటున్నారు. అయితే, బాలరాజు గౌడ్ వెనుక ఉన్నది ఎవరు? ఏ పార్టీ కోసం ఆయన ఈ దందా చేస్తున్నాడు? లేదంటే అన్నిపార్టీలకు ఈయన నుంచే హవాలా దందా నడుస్తోందా? అతనికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఇస్తున్నది ఎవరు? ఆ డబ్బంతా ఎవరిది? అనే దిశగా పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈలోగా మునుగోడుకు దొంగదారిలో డబ్బు తరలిరాకుండా అడ్డుకోవాలి. మరి ఆ పని పోలీసుల వల్ల అవుతుందా?