Heat Waves Alert for Telugu States : అసలుసిసలైన వేసవి కాలం మొదలైంది. ఉదయం 8 గంటల నుంచే సూరీడు సెగలు కక్కుతున్నాడు. అడుగు బయటపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. చిగురాకైనా ఊగక.. ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు ప్రజలు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. ఎండలతో పాటు వడగాలులు కూడా వీస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. శుక్రవారం (మార్చి 29) ఏపీలో 31 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు.
ఇటు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయ్. మరో ఐదురోజులో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఎండల తీవ్రత పెరగడంతో పాటు, వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తాయని హెచ్చరించింది. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది.
Also Read : ఫ్యాకల్టీ వేధింపులు.. భవనం పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్..
శుక్రవారం తెలంగాణలో అత్యధికంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాలలో 42.6, సూర్యాపేట జిల్లా దిర్శించర్లలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండల తీవ్రత పెరగడంతో.. విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. సాధారణంగా మే నెలలో రికార్డయ్యే అత్యధిక విద్యుత్ వినియోగం.. ఈ ఏడాది మార్చిలోనే నమోదైంది. శుక్రవారం ఒక్కనాడే.. గరిష్ఠంగా 289.697 మిలియన్ యూనిట్ల విద్యుత్ కు డిమాండ్ వచ్చింది. గతేడాది మార్చి చివరివారంలో నమోదైన రికార్డు.. ఈ ఏడాది మార్చి ఫస్ట్ వీక్ లోనే నమోదైంది. ఒక్క హైదరాబాద్ లోనే డొమెస్టిక్ విద్యుత్ వాడకం 15 శాతం పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.