Heavy rains: గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం, రాత్రివేళల్లో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
సెలవులు రద్దు చేయండి..
రాబోయె 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని… అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుంది..ఎలా ఎదుర్కోవాలనే దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయని అన్నారు. కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని… క్లౌడ్ బరస్ట్ తో ఊహించనంత నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు.
లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్త..
లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూంకు చేరేలా చూడాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ALSO READ: Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?
24 గంటలు అందుబాటులో ఉండాలి..
ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలర్ట్ చేయాలి. వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్ లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. మన వ్యవస్థలో 24 గంటల్లో 2 సీఎం.మీ వర్షం ను దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి’ అని సీఎం తెలిపారు.
ALSO READ: Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్
వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వండి..
పరిస్థితులనుబట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.