Hitec City: హైదరాబాద్ టెక్ హబ్గా పేరుగాంచిన హైటెక్ సిటీ ఇప్పుడు వేరే పేరుతో మరోసారి హెడ్లైన్లకు ఎక్కింది – “ట్రాఫిక్ టార్చర్ సిటీ”! రాహేజా మైండ్స్పేస్ నుంచి కేపిటాలాండ్ వరకూ రోజూ లక్షల మంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ఈ రోడ్డుపై, రోజుకు 1.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కానీ అతి చిన్నదైన ఒక కిలోమీటర్ రోడ్డే ఇప్పుడు లక్షల మందికి తలనొప్పిగా మారింది.
హైదరాబాద్ హైటెక్ సిటీ మాధాపూర్ లోని లెమన్ ట్రీ ప్రీమియర్ నుంచి ట్రైడెంట్ హోటల్ వరకూ కేవలం ఒక కిలోమీటర్ మైన రోడ్డే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు నరకయాతనగా మారింది. రోజూ సుమారు 1.5 లక్షల వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నా, అందుకు సరిపడే మార్గాల లేవు. ఉదయపు పీక్ అవర్స్లో ఈ ప్రాంతంలో వాహనాల వేగం గంటకు 10 కిలోమీటర్లకే పరిమితం అవుతోంది. IKEA నుంచి JNTU దాకా ప్రయాణించేందుకు కొంతమందికి గంట సమయం పడుతోంది. ఇదే సమయంలో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ కూడా అదే స్థాయిలో ఉండటంతో, ప్రతి రోజు ప్రయాణం ఓ పరీక్షగా మారింది.
ఈ మార్గం రాహేజా మైండ్స్పేస్, నాలెడ్జ్ సిటీ, కేపిటాలాండ్ వంటి ఐటీ కంపెనీలకు వెళ్లే దారిగా మారడంతో, రోజుకు సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగులు దీన్ని ఉపయోగిస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ మోడల్ కారణంగా మంగళవారం, బుధవారం రోజుల్లో వాహనాల సంఖ్య మరింత పెరుగుతోంది. మెట్రో స్టేషన్ దూరంగా ఉండటంతో, చాలామంది క్యాబ్లు లేదా వ్యక్తిగత వాహనాలతోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా రద్దీ ఇంకా పెరిగిపోతోంది.
ఇంత భారీ ట్రాఫిక్కు అసలు కారణం – ట్రైడెంట్ హోటల్ దగ్గర ఆరు లైన్లు ఒక్కసారిగా రెండు లైన్లలో కలిసిపోవడమే. రైడుర్గం అండర్పాస్ నుంచి మూడు లైన్లు, డెలాయిట్ డ్రైవ్ నుంచి రెండు, మైండ్స్పేస్ రోటరీ నుంచి మరొక లైన్ వస్తాయి. కానీ మిగిలిన మార్గంలో ఉన్న స్థలం తక్కువగా ఉండటంతో అన్ని వాహనాలు bottleneckలో చిక్కుకుంటున్నాయి.
ఇంకా సమస్యలు – ట్రాఫిక్లో బ్రేక్డౌన్లు, ఇంధనం అయిపోయే వాహనాలు, రోడ్డు పక్కన పార్కింగ్ చేయడం వంటివి. సైబర్ గేట్వే ప్రాంతంలో ఉద్యోగుల కోసం క్యాబ్ పికప్–డ్రాప్ పాయింట్లు కూడా రద్దీకి కారణమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం 8 నుంచి 11 మధ్య, సాయంత్రం 5 నుంచి 8 మధ్య ఒక్క దిశలోనే గంటకు 7,000 వాహనాలు వెళ్తున్నాయి.
ఈ సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం చూపేందుకు ట్రాఫిక్ పోలీసు శాఖ కొన్ని వాహనాలను లెమన్ ట్రీ నుంచి టెక్ మహీంద్రా రోడ్డుకు మళ్లిస్తోంది. ఇది సాధారణ మార్గానికి 1.5 కిలోమీటర్లు ఎక్కువైనా, ట్రాఫిక్ను పంచుకోవడంలో కొంత ఉపశమనం ఇస్తోంది.
దీని పరిష్కారం కోసం రోడ్ విస్తరణ పనులకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి ఆమోదం వచ్చింది. మూడవ లైన్ వేసే పనులకు టెండర్లు పూర్తయ్యాయి. ఆగస్టు చివరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే రాయిబండ తొలగింపు, భూగర్భ విద్యుత్ కేబుల్స్ మార్పిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణ సమయంలో ఒక లైన్ మూసివేయాల్సి రావడం వల్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్య మరింత పెరగవచ్చు.
దీంతో పాటు భవిష్యత్తులో మేట్రో స్టేషన్లను ఐటీ కంపెనీలకు కలిపే డ్రైవర్లెస్ పోడ్ వాహనాల ప్రణాళిక కూడా ఉంది. ఈ పోడ్స్ 6 మంది ప్రయాణీకులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉండేలా ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేందుకు కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
ఇంతవరకూ ఉన్న పరిష్కారాలు తాత్కాలికమే. ప్రస్తుతానికి ఉద్యోగులు IKEA నుంచి JNTU వరకూ రోజూ ఓ ట్రాఫిక్ బాధతోనే ప్రయాణించాల్సిన పరిస్థితి. సంవత్సరం చివరికి రోడ్ విస్తరణ పూర్తవుతుందన్న ఆశతో, అందరూ ఓపిక పట్టే ప్రయత్నం చేస్తున్నారు.