Sridhar Babu: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో భూకన్వర్షన్ ఫీజులు, పరిశ్రమల భూముల కేటాయింపులు, గత ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. HMDA జోన్లో ఎకరానికి రూ.36 లక్షల కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన గత ప్రభుత్వ హయాంలోనే అమలులోకి వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అయితే ఆ విధానాన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చి భూములను దారాదత్తం చేసిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.
గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం వందల ఎకరాల పరిశ్రమల భూములను.. ప్రత్యేక కంపెనీలకు అప్పగించిందని మంత్రి ఆరోపించారు. ముఖ్యంగా సిరీస్ కంపెనీకి సంబంధించిన భూమిని దారాదత్తం చేయడం ద్వారా ప్రజా సంపదను ప్రైవేటు ప్రయోజనాలకు వినియోగించారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200 శాతం SRO విలువకు కూడా భూములు కంపెనీలకు కేటాయించారన్న విషయాన్ని మంత్రి బహిర్గతం చేశారు.
గ్రిడ్ పాలసీ పేరుతో భూముల విలువను పెంచి, కూకట్పల్లి, నాచారం, బాలానగర్, అజాంబాద్, ఆఫీజ్పేట వంటి ప్రాంతాల్లో కన్వర్షన్లను ఇష్టారాజ్యంగా చేపట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించాలని గత ప్రభుత్వం నిర్ణయించినా, ఆ అమలు ఎక్కడా కనిపించలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే కంపెనీలతో కుమ్మక్కయ్యారన్న మాట వాస్తవం కాదా? అనే సందేహాలు ప్రజల్లో బలపడుతున్నాయి.
మార్చి 1, 2013 నాటికే పరిశ్రమలను ORR వెలుపలికి తరలించాలంటూ సూపర్ కోర్ట్ ఆఫ్ ఇండియా (Supreme Court of India) ఆదేశాలు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా 20 ఇండస్ట్రియల్ పార్కుల కన్వర్షన్కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదని వ్యాఖ్యానించారు.
గ్రేటర్ హైదరాబాద్ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల కలుషితంతో నిత్యం గాలికాలుష్యం, నీటి కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, నగరాన్ని పర్యావరణహితంగా మార్చేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న భూకేటాయింపు నిర్ణయాలన్నింటిని 2025 జూన్ 25న సమీక్షించినట్టు వెల్లడించారు. స్టేక్ హోల్డర్లతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని చెప్పారు.
Also Read: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
మీ హయాంలో 9 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయి? అంటూ మాజీ ప్రభుత్వాన్ని మంత్రి నిలదీశారు. భూమి పెరగడం, తగ్గడం సహజమే కానీ, లీజు భూములను ఫ్రీహోల్డ్గా మార్చి కంపెనీలకు లాభం చేకూర్చడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నకు అప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలానగర్, అజాంబాద్ ప్రాంతాల్లో లీజు ల్యాండ్లను ఫ్రీహోల్డ్గా మార్చిన అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రజల ముందుంచుతామని మంత్రి తెలిపారు.