తెలంగాణ పోలీసు శాఖ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు స్పందించిన 41 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. గత కొన్నేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో క్యాడర్ లొంగిపోవడం ఇదే మొదటిసారి అని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
లొంగిపోయిన మావోయిస్టులు తమతో పాటు భారీగా మారణాయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. మొత్తం 24 ఆయుధాలను వారు డీజీపీకి అందజేశారు. 3 AK-47 రైఫిళ్లు, 1 LMG (లైట్ మెషిన్ గన్), 5 SLR రైఫిళ్లు, 7 ఇన్సాస్ రైఫిళ్లు, 1 BGL గన్, 4 .303 రైఫిళ్లు, 1 సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ ఉన్నాయి.
కీలక నేతలు లొంగుబాటు..
లొంగిపోయిన వారిలో సుదీర్ఘకాలం అండర్ గ్రౌండ్లో ఉన్న కీలక నేతలు ఉండటం గమనార్హం. ముఖ్యంగా 24 ఏళ్లుగా అజ్ఞాతంలో గడుపుతున్న తెలంగాణకు చెందిన ఎర్ర గల్ల రవి అలియాస్ సంతోష్, అలాగే ప్రవీణ్ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరితో పాటు పిడిఎస్ సభ్యుడు, పార్టీ కీలక నాయకుడు కనికారుపు ప్రభంజన్ కూడా శాంతి బాట పట్టారు. వీరిలో గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు చెందిన 11 మంది, తెలంగాణ స్టేట్ రెండో రీజినల్ కమాండ్కు చెందిన ఐదుగురు, కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన DVC స్టేట్ కమిటీ క్యాడర్ చెందిన వారు నలుగురు ఉన్నారు.
ఈ లొంగుబాటులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, లొంగిపోయిన 41 మందిలో 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందిన వారు. పొరుగు రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్ ఇప్పుడు తెలంగాణ పోలీసుల ద్వారా జనజీవన స్రవంతిలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరంతా లొంగిపోయారని తెలిపారు. ‘హింస ద్వారా ఏదీ సాధించలేమని గ్రహించి, ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. అడవిలో ఉన్న మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన కోరారు.
ALSO READ: HYDRA: ఇది కదా హైడ్రా పనితీరు అంటే.. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం