Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో చరిత్రలో లిఖించే రోజు ఇది. ఓ వ్యక్తికి సకాలంలో గుండె మార్పుకై మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు వైద్యులు. నగరంలో ట్రాఫిక్ సమస్య తో, మనిషి ప్రాణాన్ని కాపాడలేమని గ్రహించిన ఆ వైద్యులు, ఏకంగా హైదరాబాద్ మెట్రో యాజమాన్యాన్ని సంప్రదించారు. అసలు విషయాన్ని తెలుసుకున్న మెట్రో యాజమాన్యం మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రోలో గుండె తరలింపును చేపట్టారు. ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులకు సహకరించిన మెట్రోకు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ప్రప్రధమ స్థానం మెట్రోదే. ఎందరో నగరవాసులు హైదరాబాద్ మెట్రో ద్వారా రవాణా సాగిస్తూ, మెట్రో సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండవ దశ నిర్మాణ పనులకు కూడా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రో, శుక్రవారం ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది.
అసలేం జరిగిందంటే.. ఎల్బీనగర్ లోని కామినేని వైద్యశాల నుండి లక్డికపూల్ గ్లోబల్ వైద్యశాలకు మనిషి గుండెను అత్యవసరంగా తరలించాల్సి ఉంది. గ్లోబల్ వైద్యశాలలో గల పేషెంట్ కు గుండె మార్పిడి ఆపరేషన్ అత్యవసరమైంది. ఎల్బీనగర్ నుండి లక్డికపూల్ కు గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించేందుకు ట్రాఫిక్ సమస్య అడ్డుగా వచ్చింది. ఇక అంతే వైద్యులు వెంటనే హైదరాబాద్ మెట్రో యాజమాన్యాన్ని సంప్రదించారు.
Also Read: Congress vs BRS Party: పదేళ్లు గుర్తుకు రాలే.. ఇప్పుడు కేటీఆర్ గోల అందుకేనా?
మనిషి అవయవాలను అంబులెన్స్ లలో, విమానాలలో తరలించడం పరిపాటి. కానీ మెట్రో యాజమాన్యం అంగీకరించడంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఎల్బీనగర్ నుండి లక్డికపూల్ వరకు మెట్రో రైలులో గుండెను తరలించారు. సకాలంలో గ్లోబల్ వైద్యశాలకు గుండె చేరగా, వైద్యులు సదరు రోగికి శస్త్రచికిత్స చేసేందుకు ఉపక్రమించారు. ఇప్పటివరకు హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న మెట్రో, వ్యక్తి ప్రాణాలను కాపాడటంలో కూడా అంతే స్థాయిలో సహకరించడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో అధికారులకు, సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.