Anganwadi Centre: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఒకటో వార్డులోని అంగన్వాడీ కేంద్రం సమస్యలతో సతమతమవుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందించాల్సిన కేంద్రంలో కనీస వసతులు కరవయ్యాయి. ఫ్లోరింగ్, మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు.
2024లో ఎమ్మెల్యే కోటా నుంచి రూ.6.50 లక్షలు మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టినా పనులు పూర్తికాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్లోరింగ్ లేక చిన్నారులు మట్టినేలపైనే కూర్చోవాల్సి వస్తోందన్నారు. ఎలుకలు రంధ్రాలు చేయడంతోపాటు అప్పుడప్పుడు పాములు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!
ఎలుకల కారణంగా కేంద్రంలో నిల్వ ఉంచే గుడ్లు, పిండి పదార్థాలు, ఇతర పౌష్టికాహారం పాడవుతోందని స్థానికులు తెలిపారు. మరుగుదొడ్డి లేకపోవడంతో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని పూర్తి చేసి కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.
అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు ఉన్న విషయం వాస్తవమేనని సీడీపీఓ సుశీల తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
Also Read: అనకాపల్లి కి నయా లుక్.. మన ఊరు-మన బాధ్యత సీఎం చంద్రబాబు పిలుపు!