Ganesh Immersion: స్వేచ్ఛ బ్యూరో: గణేష్ నిమజ్జనం కోసం హైడ్రా కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువును సిద్దం చేస్తుంది. చెరువులో గణేష్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా భగీరథ ప్రయత్నం చేస్తుంది. వేలాదిగా తరలి వచ్చే విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరేలా ఏర్పాట్లు మొదలు పెట్టింది. ప్రధాన రహదారివైపు చెరువును లోతుగా తవ్వి, నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటుంది. వ్యర్థ జలాలు పోయి మంచి నీరు చేరేలా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 20 అడుగులకు పైగా వ్యర్థాలతో కూడిన పూడికను తొలగించడంతో ఊట నీరు కూడా వచ్చి చేరనుంది. ఈ నీటికి తోడు అదనంగా నీటిని నింపే ఏర్పాట్లు హైడ్రా చేపట్టింది. గణేష్ నిమజ్జనం సమయానికి ఈ ఏర్పాట్లు పూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే ఐడీఎల్ చెరువును సందర్శించి నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. చెరువు పునరుద్ధరణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండానే, చెరువులో నిమజ్జనానికి అనువుగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులతో పాటు ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు కూడా హైడ్రా కమిషనర్ను కలిసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కోరారు. చెరువు మిగతా ప్రాంతంలో ఉన్న నీటిని మొత్తం ఇక్కడకు తీసుకువచ్చి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ మేరకు కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Also read: వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
కూకట్ పల్లి ఐడీఎల్ చెరువులో తవ్విన కొద్దీ ప్రమాదకర వ్యర్థాలు బయటకు వస్తున్నట్లు హైడ్రా వెల్లడించింది. నేరుగా మురుగు చేరడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి పీచు, చెత్త పెద్దమొత్తంలో బయట పడుతోంది. వ్యర్థాలు నీటి అడుగుకు చేరి, భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేకుండా మారింది. ఇప్పుడా వ్యర్థాల తొలగింపుతో పాటు తరలించడం చాలా ఇబ్బందిగా మారింది. రాంకీ సంస్థ ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా వెల్లడించింది. పీఓపీలో కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ప్రధానంగా ఉంటుంది. ఇది నీటిలో కలిసినప్పుడు జిప్సంగా మారి, కరగడానికి వీలు లేకుండా అడుగుభాగంలో పేరుకుపోతుంది.
ఇలా దశాబ్దాలుగా ఐడీఎల్ చెరువులోకి చేరే పీఓపీతో కాలుష్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు పెరగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. మురుగు నీటితో కొట్టుకొచ్చిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పీవోపీని ఎప్పటికప్పుడు తొలగిస్తే ప్రమాదం ఉండేది కాదని, ఇప్పుడిది 20 అడుగులకు పైగా పేరుకుపోయింది. లక్షల టన్నుల పూడికను హైడ్రా తొలగిస్తుంది. రాత్రి, పగలు పూడికను తొలగించి, ఐడీఎల్ చెరువు ప్రధాన రహదారికి ఆనుకుని లోతుగా చెరువును తవ్వుతోంది. ఇందులోకి నీరు వచ్చేలా చర్యలు తీసుకుంది. నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. నిమజ్జనం తర్వాత మొత్తం పూడికను తొలగించి 72 ఎకరాల మేర చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేయడానికి హైడ్రా చర్యలు మొదలు పెట్టింది.
Also read: అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం