Cyber Crime Police: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ; సైబర్ క్రిమినల్స్ కు చెక్ పెట్టే దిశలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు భారీ విజయం సాధించారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఆక్టోపస్ పేర ఆపరేషన్ జరిపి 104మందిని అరెస్ట్ చేశారు.వీరిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, బ్యాంక్ ఖాతాల సరఫరాదారులతోపాటు కొందరు బ్యాంక్ అధికారులు కూడా ఉండటం గమనార్హం. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవలిగా ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్ లతోపాటు డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలంటూ ఆశ పెట్టి కొందరినీ…మీపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు నమోదయ్యాయి…డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ మరికొందరిని భయపెట్టి సైబర్ క్రిమినల్స్ లక్షల రూపాయలు లూటీ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 32 బృందాలుగా విడిపోయి ఆక్టోపస్ పేర స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు.
Also Read:Women’s T20 World Cup 2026: టీమిండియా, పాక్ మధ్య మరో మ్యాచ్..ఎప్పుడంటే
మొదట బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును మళ్లించటానికి ఉపయోగించిన 151 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. ఏయే రాష్ట్రాల్లో ఆ అకౌంట్లు ఉన్నాయో నిర్ధారించుకున్నారు. అనంతరం ఏకకాలంలో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. పదిరోజులపాటు సాగించిన ఈ దాడుల్లో మొత్తం 104మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కమీషన్లు తీసుకుంటూ తమ అకౌంట్లలో జనం నుంచి కొల్లగొట్టిన డబ్బును జమ చేయటానికి అప్పగించిన 86మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. ఇక, సైబర్ క్రిమినల్స్ కు అకౌంట్లను సప్లయ్ చేస్తున్న వారు అగ్రిగేటర్లు 17మందిని పట్టుకున్నారు.
సైబర్ కేటుగాళ్లతో కుమ్మక్కై నకిలీ ఖాతాలు తెరవటానికి సహకరించిన బంధన్ బ్యాంక్ రిలేషిన్ షిప్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో అరెస్టయిన ఈ నిందితులకు దేశవ్యాప్తంగా 1,055 సైబర్ నేరాల్లో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ మోసాల్లో మొత్తం 127 కోట్ల రూపాయలను బాధితులు పోగొట్టుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇక, అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్ బుక్కులు, 234 డెబిట్/క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్ టాప్ లు, కార్పోరేట్ సంస్థల పేర తయారు చేసిన 56 రబ్బర్ స్టాంపులు, 36లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ను స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షించారు. ఇక, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్, డిటెక్టీవ్ ఇన్స్ పెక్టర్లు, ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీరందరిన కమిషనర్ వీ.సీ.సజ్జనార్ అభినందించారు.
Also Read: Komali Death: కోమలి సూసైడ్కి ముందు అసలు ఏం జరిగింది?.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?