Footpaths: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఫుట్ పాత్ లపై వెలిసిన ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఫుట్ పాత్ ల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేషన్ల అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తొలి దశగా మెయిన్ రోడ్ల ఫుట్ పాత్ లపై శాశ్వతంగా, తాత్కాలికంగా వెలిసిన ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించి, ఆ తర్వాత రెండో దశలో సబ్ రోడ్ల ఫుట్ పాత్ లపై యాక్షన్ తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణలపై వచ్చే సోమవారం నుంచి ఉక్కుపాద మోపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాదచారుల హక్కులను కాపాడటంతో పాటు వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ ఫుట్ పాత్ ల ఆక్రమణలను తొలగించేందుకు సిద్దమైనట్లు తెలిసింది.
ఈ విషయానికి సంబంధించి మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలను ప్రారంభించింది. నగరంలో ఫుట్పాత్లపై పెరుగుతున్న ఆక్రమణలు పాదచారుల ప్రయాణాన్ని ఇబ్బందుల పాలు చేయటంతో పాటు, ఫుట్ పాత్ లు అందుబాటులో లేకపోవటంతో పాదచారులు రోడ్లపై రాకపోకలు సాగిస్తూ, ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్న సంకల్పంతో ఈ ఆక్రమణలను తొలగించాలని కార్పొరేషన్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఫుట్ పాత్ ఆక్రమణలపై ఈ నెల 27 నుంచే సర్వే మొదలైనట్లు తెలిసింది. మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఫుట్పాత్లపై వెలిసిన ఆక్రమణలు, తాత్కాలిక దుకాణాలు, వాహానాల పార్కింగ్ వంటి ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంబంధిత విభాగాల మధ్య సమన్వయం పెంచుతూ, పోలీస్ లా అండ్ ఆర్డర్ శాఖ, ట్రాఫిక్ శాఖ సహకారంతో సమగ్ర చర్యలకు సిద్దమవుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దశల వారీగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టాలని మూడు కార్పొరేషన్ల అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పూర్తిగా అడ్డంకులు లేని, శుభ్రమైన పాదచారి మార్గాలను అందుబాటులోకి తేవాలని మూడు కార్పొరేషన్లు యోచిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు సురక్షితంగా నడిచి వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి, పూర్తి స్థాయిలో ఫుట్ పాత్ లను పాదచారుల అవసరాలకు తగిన విధంగా అందుబాటులోకి తీసుకువస్తే, పర్యావరణ హితంగా కూడా మేలు కల్గుతుందన్న వాదనలున్నాయి.
Also Read: Crime News: మేడ్చల్ బస్టాండ్లో పట్టపగలు గంజాయి బ్యాచ్ కలకలం
దశాబ్దాలుగా ఫుట్ పాత్ లపై వెలిసిన ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా రాజకీయ అడ్డంకులేర్పడుతున్నాయి. ముఖ్యంగా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నందున, ఆక్రమణల తొలగింపునకు ప్రయత్నాలు చేసినపుడల్లా అనూహ్యాంగా అడ్డంకులేర్పడుతున్నాయి. కానీ ఈ సారి కోర్ అర్బన్ రీజియన్ లోని అన్ని మెయిన్ రోడ్లలోని పుట్ పాత్ లపై వెలిసిన ఆక్రమణలను ఓ పక్కా ప్లాన్, పకడ్బందీ వ్యూహాంతో తొలగించేందుకు అధికారులు సిద్దమైనట్లు సమాచారం. ఆక్రమణల తొలగింపునకు కావల్సిన బందోబస్తును పోలీసు శాఖ నుంచి పొందేందుకు ఇప్పటికే మున్సిపల్ అధికారులు పోలీసు శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఎక్కడెక్కడ ఫుట్ పాత్ ఆక్రమణలను ఎపుడెపుడు తొలగించాలన్న విషయాలతో ప్రణాళికలను సిద్దం చేసుకుని, ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది.
పాత జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9 వేల చదరపు కిలోమీటర్ల పొడువున సీసీ, బీటీ రోడ్లున్నాయి. వీటిలో సీసీ రోడ్లు సుమారు 3 వేల చదరపు కిలోమీటర్ల మేరకుండగా, బీటీ రోడ్లు ఆరు వేల చదరపు కిలోమీటర్ల మేరకున్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు మొత్తం రోడ్ల పొడువులో 20 శాతం అంటే దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల పొడువున ఫుట్ పాత్ లుండాలి. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం దాదాపు 600 చదరపు కిలోమీటర్ల పొడువున మాత్రమే ఫుట్ పాత్ లున్నాయి. ఆక్రమణలను తొలగించిన తర్వాత ఫుట్ పాత్ లు లేని రద్దీ ప్రాంతాలను గుర్తించి, ఫుట్ పాత్ లను పెంచాలని కూడా అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read; Paddy Procurement: ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. ఈ సారీ క్వింటాల్ ధర ఎంతో తెలుసా..?