జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, సిట్ (SIT) కార్యాలయం పరిసర ప్రాంతాలు శుక్రవారం భారీ ఆందోళనలతో దద్దరిల్లాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నేపథ్యంలో.. ఆయనను వెంటనే బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఓయూ (OU) విద్యార్థి విభాగం నేతలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కేటీఆర్ను విచారణ పేరుతో లోపలే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి నాయకులు ప్రభుత్వం మరియు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కేటీఆర్ ను వెంటనే విడుదల చేయాలి’ అంటూ వారు స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు విద్యార్థి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను సమీపంలోని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సిట్ కార్యాలయం వద్ద హై టెన్షన్..
మరోవైపు సిట్ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో నాయకులు గుమిగూడకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్లోకి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ‘కనీసం టీ తాగడానికి కూడా వెళ్లనివ్వరా?’ అంటూ నేతలు పోలీసులపై మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట pic.twitter.com/ruKF2zsnv2
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2026
చట్నీస్ హోటల్ వద్ద ధర్నా..
జూబ్లీహిల్స్ పీఎస్ పక్కనే ఉన్న ప్రసిద్ధ చట్నీస్ హోటల్ వద్ద మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పోలీసుల ఆంక్షలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు.