Pemberthy Incident: జనగామ జిల్లా పెంబర్తి వద్ద శుక్రవారం మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది.
పెంబర్తి క్రాస్ రోడ్డు వద్ద వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక బిఆర్ఎస్ కౌన్సిలర్ను ఆహ్వానించడంతో వివాదం మొదలైంది.
ఇది ప్రభుత్వ కార్యక్రమమని, బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా “పల్లా గో బ్యాక్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పరిస్థితి విషమించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి పర్యటనలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరగడం స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాన్ బెయిలబుల్ వారెంట్.. కోర్టు సీరియస్ వార్నింగ్