Drunk Driving: పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో మరోసారి పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. వారం వారం స్పెషల్ డ్రైవ్ జరిపి అరెస్టులు చేస్తున్నా మేము మాత్రం మారేది లేదంటున్నారు తాగుబోతులు. తాజాగా జరిపిన వీకెండ్ స్పెషల్ డ్రైవ్ లో హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో 718 మంది పీకలదాకా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 445మంది మందుబాబులు పోలీసుల చేతికి చిక్కారు.వీరిలో 377మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. ఇక, ఆటోలు నడుపుతూ 22మంది, కార్లు నడుపుతూ మరో 46 మంది దొరికారు. అందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడ్డ అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరుస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
Also Read: Tiger Movement: హమ్మయ్యా.. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెల్లిని పెద్దపులి..?
ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 273మంది మందుబాబులు దొరికారు. వీరిలో 214మంది ద్విచక్ర వాహనదారులు, 8మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు. కార్లు నడుపుతూ 49మంది, భారీ వాహనాలను డ్రైవ్ చేస్తూ ఇద్దరు దొరికారు. అందరిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్టు ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. పట్టుబడ్డ వారిని ఆయా కోర్టుల్లో హాజరు పరుస్తామన్నారు. గత వారం పట్టుబడ్డ వారిలో ఆరుగురికి కోర్టులు జరిమానాతోపాటు జైలుశిక్ష విధించాయని తెలిపారు. మరో నలుగురికి జరిమానా విధించటంతోపాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
Also Read: Inter-State Vehicle Transfers: వాహనదారులకు గుడ్ న్యూస్, ఇక ఆ వాహనాలకు NOC అవసరం లేదట!