Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరవాసులను వరుణుడు మరోసారి పలకరించాడు. దక్షిణ హైదరాబాద్ శివార్లలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పాతబస్తీలోని బహదూర్పురా, షాహలి బండ, కాలాపతేర్, అలియాబాద్, మదీనా వంటి కీలక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలవ్వగా, రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిసరాల్లో వర్షం నమోదవుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ అకస్మాత్తు మార్పు వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దక్షిణ హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ భారీ పిడుగుల హెచ్చరిక జారీ చేసింది. ఇబ్రహీంపట్నం, బీఎన్ రెడ్డి నగర్, మీర్ పేట్, బాలాపూర్, నాదర్గుల్ మీదుగా ఒక భారీ మేఘావృతమైన తుపాను వ్యవస్థ కదులుతోంది. ఇది రాబోయే రెండు గంటల్లో ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్, నాగోల్, మేడిపల్లి, కాప్రా, అంబర్ పేట, రామంతాపూర్, సైదాబాద్ ప్రాంతాల్లోకి ప్రవేశించనుంది. ఈ తుపాను ప్రభావంతో ఈ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నగర శివార్లలోని మీర్ పేట్, బడంగ్పేట్, అల్మాస్గూడ, కర్మన్ఘాట్ పరిసరాల్లో ఇప్పటికే జల్లులు కురుస్తున్నాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించే ప్రమాదం ఉన్నందున, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్ఎంసి (GHMC) అలర్ట్ ప్రకటించింది.
Read Also: అసెంబ్లీలో రేషన్ సన్నబియ్యం గుమగుమలు.. విందు ఆరగించిన సీఎం, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు