Women Safety Telangana: హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు భరోసా కల్పిస్తూ, వేధింపులకు పాల్పడే ఆకతాయిల పాలిట ‘షీ టీమ్స్’ (SHE Teams) సింహస్వప్నంగా మారాయి. 2025 సంవత్సరానికి సంబంధించి షీ టీమ్స్ సాధించిన విజయాలు, పరిష్కరించిన కేసుల వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో షీ టీమ్స్ మొత్తం 1,149 ఫిర్యాదులను పరిష్కరించి, బాధితులకు విముక్తి కల్పించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి ఏకంగా 3,826 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించడం పెద్ద సమస్యగా మారింది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా 366 కేసులు ‘బ్లాక్మెయిలింగ్’కు సంబంధించినవే కావడం గమనార్హం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియో కాల్స్ స్క్రీన్ రికార్డింగ్లను అడ్డు పెట్టుకుని డబ్బు కోసం లేదా శారీరక లొంగుబాటు కోసం వేధిస్తున్న ముఠాల ఆటను షీ టీమ్స్ కట్టడి చేశాయి. ముఖ్యంగా ప్రేమ విఫలమైన తర్వాత పాత ఫోటోలతో మాజీ ప్రేమికులు చేస్తున్న బెదిరింపుల నుండి వందలాది మంది మహిళలకు పోలీసులు రక్షణ కల్పించారు.
సాంకేతికతను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్ కాల్స్, అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలతో వేధిస్తున్న 121 కేసులను పోలీసులు ఛేదించారు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లతో వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న నిందితులను సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేశారు. అలాగే, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసిన 98 ఫిర్యాదులపై స్పందించి, నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, మానసిక క్షోభలో ఉన్న బాధితులకు నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించారు.
నగరంలోని బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో 15 ప్రత్యేక బృందాలు మఫ్టీలో నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. 2025లో పట్టుబడిన 3,826 మంది ఆకతాయిలలో, స్వల్ప నేరాలకు పాల్పడిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపగా, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేసి జైలుకు పంపారు.
“మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవు” అని సీపీ సజ్జనర్ తీవ్రంగా హెచ్చరించారు. వేధింపులను మౌనంగా భరించవద్దని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: PM Modi Mann Ki Baat: అనంతపురంలో జలాశయాల పునరుద్ధరణ.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు