Laptop Theft: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఇటీవల కలకలం రేపిన భారీ ల్యాప్టాప్ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. గచ్చిబౌలి సీఐ బాలరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. విలాసాలకు అలవాటు పడి, అప్పులు తీర్చేందుకు ఏకంగా యూనివర్సిటీలోనే దొంగతనానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులతో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రకాశం జిల్లాకు చెందిన రెగ్యుల చంద్రశేఖర్ (30), విద్యార్థులైన సాయి చందర్ (19), అశ్విన్ రావు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు.. సుమారు రూ. 2 లక్షల అప్పు తీర్చేందుకు అడ్డదారి తొక్కారు. పక్కా ప్లాన్తో యూనివర్సిటీలోని సి.వి. రామన్ ఇనిస్టిట్యూట్ నుండి సుమారు 60 ల్యాప్టాప్లను దొంగిలించారు. ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన విద్యార్థులు.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు కటకటాలపాలయ్యారు.
ఈ చోరీలో నిందితులు అత్యంత తెలివిగా వ్యవహరించారు. దొంగతనానికి వాడిన కారు నెంబర్ ప్లేట్ మార్చడమే కాకుండా.. పోలీసుల కదలికలను కనిపెట్టేందుకు యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్లను తమ ఫోన్లకు కనెక్ట్ చేసుకున్నారు. తద్వారా నిఘా నీడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే.. గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి TNGO’s కాలనీ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దొంగిలించిన 60 ల్యాప్టాప్లను విక్రయించేందుకు నిందితులు బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద నుండి 60 ల్యాప్టాప్లు, 2 కార్లు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. విద్యార్థులు నేరాల వైపు మళ్లకుండా ఉండాలని.. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
Also Read: ఆకివీడులో ‘కోవా బన్’ రగడ.. నడిరోడ్డుపై వ్యాపారి కాలర్ పట్టుకున్నబీజేపీ నేత వీరంగం!