HYDRAA: సున్నం చెరువుతో పాటు ఇతర చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టీఎల్) పరిధి ఒక్కసారి ఫిక్స్ అయితే వాటిలో ఎలాంటి మార్పులుండవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిని 2014లోనే నిర్ణయించారని, ఆ మేరకే అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. సున్నం చెరువు వద్ద కొందరికి లబ్ధి చేకూర్చాలని 5 ఎకరాల వరకు మినహాయించి ఎఫ్టీఎల్ హద్దులను హైడ్రా నిర్ధారిస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) చేస్తున్న ఆరోపణలు సరికాదని, కమిషనర్ ఖండించారు. సున్నం చెరువు వద్ద ప్రభుత్వ భూమిని కలిపి గతంలో ఫెన్సింగ్ వేసి ఉంటారని, చెరువు ఎఫ్టీఎల్ కు ఇది వర్తించదన్నారు.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. చెరువు చెంత ప్రభుత్వ భూమి ఉంటే తప్పకుండా స్వాధీనం చేసుకుని, అక్కడ పార్కులు, ప్లే ఏరియాలు వచ్చేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మాధాపూర్లోని తమ్మిడికుంటతో పాటు మొదట విడత చేపట్టిన ఆరు చెరువుల వద్ద ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. గతంలో హైడ్రా చర్యలను అభినందించడమే గాకా, సహకరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అకస్మాత్తుగా హైడ్రా చర్యలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక ఉన్న కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు. కూకట్పల్లి జోన్ పరిధిలో భూములు విలువ ఎక్కువగా ఉండడం వల్లనో, మరే ఇతర కారణాలో కాని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టు ఎక్కువ ఫిర్యాదులు అక్కడి నుంచే వస్తున్నాయని కమిషనర్ చెప్పారు.
Also Read: Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం
హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే కూకట్పల్లి జోన్ నుంచే 40 శాతం ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు కాపాడి పర్యావరణహితమైన నగర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే హైడ్రా పని చేస్తుందని ఆయన వివరించారు. ఏ ఒక్కరి పక్షానా హైడ్రా పని చేయదని, ప్రజలందరూ మెరుగైన జీవితం సాగించేలా హైడ్రా చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటి వరకూ 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, ఇందులో బడాబాబులుగా చెలామణి అవుతున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయాలకతీతంగా హైడ్రా పని చేస్తోందని గుర్తు చేశారు.
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే హైడ్రా వంతని, ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ దిశగా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే ప్రజావసరాలకు ఉద్దేశించి పలు శాఖలకు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు. అక్కడ సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా వివిధ శాఖలకు సర్కారు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో ఇటీవల హైడ్రా ఏడు ఎకరాల వరకు కాపాడితే, వెంటనే ప్రభుత్వం ఆ భూమిని విద్యా సంస్థలకు కేటాయించడంతో పాటు పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుందని కమిషనర్ రంగనాధ్ తెలిపారు.
Also Read: Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?