Ranganath on Hydra: హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుండి శాశ్వతంగా రక్షించే విధంగా తగిన ప్రణాళికలు హైడ్రా సిద్ధం చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ లో మంగళవారం సాంకేతిక పరిజ్ఞానంతో విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులపై హెచ్ఐసీసీలో జియో స్మార్ట్ ఇండియా – 2024 సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చిందంటే చాలు. పెద్దపెద్ద మహానగరాలు కూడా వరద ముప్పుకు గురవుతుండడం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు.
నగరాలకు వరద ముప్పు వాటిల్లిన సమయంలో, అధిగమించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర స్థాయిలో శ్రమించాల్సి వస్తుందన్నారు. కేవలం రెండు సెంటీమీటర్ల వర్షం కురిసినా, హైదరాబాద్ నగరం వరద ముంచెత్తి ట్రాఫిక్ జామ్ కు కారణం అవుతుందన్నారు. దీనితో నగరవాసుల సమయం వృధా కావడంతోపాటు, వాహన కాలుష్యం కూడా పెరిగిపోయే అవకాశం ఉందని రంగనాథ్ అన్నారు. నగరంలో కేవలం 0.95 శాతం వర్షం నీరు మాత్రమే భూమిలోకి యింకుతోందని, నివాస ప్రాంతాలు పెరగడం, చెరువులు నాలలు కబ్జాకు గురి కావడంతో, వరద కాలనీలను, రహదారులను ముంచెత్తుతోందని కమిషనర్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అమీన్ పూర్ సరస్సు గురించి ట్వీట్ చేయడంపై రంగనాథ్ స్పందించారు. అమీన్పూర్ సరస్సులోకి యూరప్ నుండి వలస పక్షులు వస్తున్నాయని, తాము అక్రమణలను తొలగించడంతో ప్రకృతి కూడా నూతన సౌందర్యాన్ని సంతరించుకుందన్నారు. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్పూర్ సరస్సులోకి తూర్పు యూరప్ నుంచి వలస వచ్చిన 12- సెంటీమీటర్ల రెడ్ బ్రెస్టెట్ ఫ్లైక్యాచర్ పక్షి కనిపించడం అరుదైన దృశ్యంగా కమిషనర్ అభివర్ణించారు.
Also Read: Indian Railway – Ayyappa Devotees: శబరిమలైకు రైలులో వెళ్తున్నారా.. ఈ రూల్ తప్పక పాటించాల్సిందే!
వరద కాలువలను పునరుద్ధరించి గొలుసు కట్టు చెరువులను క్రమబద్ధీకరిస్తామని, ప్రస్తుతం చెరువుల చుట్టుకొలత లెక్కలు తెలిసే పనిలో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందుకై వాతావరణ శాఖ సహకారం ఎంతో అవసరమని, వెదర్ రాడార్ ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వర్షం రాకను ముందే గుర్తించడం ద్వారా నగరాలను వరద ముప్పు నుండి కాపాడవచ్చని రంగనాథ్ అన్నారు. అనంతరం చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ పై హైడ్రా తీసుకుంటున్న చొరవను జియో స్మార్ట్ ఇండియా సదస్సు ప్రత్యేకంగా అభినందించింది.