Hydra Commissioner: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని చెప్పారు. హైడ్రాకు చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని తెలిపారు. 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుందని.. తమ పరిధిలో మొత్తం 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు.
హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని.. ఐదు నెలల అనుభవంతో వచ్చే ఏడాదికి రూట్ మ్యాప్ సిద్దం చేశామని చెప్పారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉంటుందని వెల్లడించారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారులు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించినట్లు చెప్పారు. 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందని అన్నారు. చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందని,. త్వరలో తమకు వెదర్ రాడార్ రాబోతుందన్నారు. అంతేకాకుండా హైడ్రా కోసం ఒక FM ఛానెల్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. నోటరీ ఉన్న వాటిని కొనేటప్పుడు ప్రజలు ఆలోచించాలని గుర్తుచేశారు. వెరిఫై చేసి భూములను కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎఫ్టీఎల్ , బఫర్ జోన్పై ప్రజలకు అవగాహన పెరిగిందని అన్నారు. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారని అన్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు. వచ్చే ఏడాదికి చెరువుల్లో సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్టీఎల్ నిర్దారణ చేస్తామని చెప్పారు. ఎఫ్టీఎల్ను పారదర్శకంగా చేయడమే తమ బాధ్యత అని తెలిపారు. శాటిలైట్ ఇమేజ్తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని అన్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నామని అన్నారు. ఎఫ్టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుందని రంగనాథ్ చెప్పారు.
Also Read:Jobs Notifications: గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..
శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుందని అన్నారు. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయని చెప్పారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. 27 పురపాలక సంఘాలపై కూడా తమకు అధికారం ఉందని గుర్తు చేశారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టామని అన్నారు. అలాగే 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేపడుతామని తెలిపారు.
12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. నాగోల్లో ఉన్న డీఆర్ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందని.. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్కు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుందని. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎఫ్టీఎల్లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దని.. ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.