Hydra Demolitions: హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, GHMC, HMDA ఆఫీసర్లు కూల్చివేశారు.
మూడుసార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాంపూర్ చెరువును హైడ్రా కమీషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువును పరిశీలించి FTL, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. దీంతో రంగనాథ్ అదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
చెరువుల సంరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది హైడ్రా. ఒకదశలో సిటీ నలుమూలలా బుల్డోజర్లను పరుగులు పెట్టించిన హైడ్రా.. చెరువులను కబ్జా చేసి కట్టినవాటిపై కఠినంగానే వ్యవహరించారు. ఇప్పుడు హైడ్రా ఫైలెట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ లోని నాలుగు చెరువులను అభివృద్ది చేసేందుకు శ్రీకారం చుట్టింది.
Also Read: గులాబీలో గుబులు.. సిరిసిల్లలో బయటికొస్తున్న భూకబ్జాలు
ఇప్పటికే ఆయా చెరువుల డిపిఆర్ లు సైతం సిద్దం చేసింది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అనంతరం చెరువుల అభివృద్ది పనులను మొదలుపెట్టనుంది. కబ్జాల కబంధ హస్తాలలో కనుమరుగు అవుతన్న చెరువులను పునరుద్దరణ చేయడమే లక్ష్యంగా హైడ్రా 2025 ప్రణాళికలు రూపొందిస్తుంది. హైదరాబాద్ నగరాన్ని తిరిగి లేక్ సిటీగా మార్చేందుకు హైడ్రా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుంది.
ఇటీవల మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్థుల భవాన్ని ఇవాళ కూల్చివేసిన సంగతి తెలిసిందే. గతంలోనే ఈ బిల్డింగ్ ను కూల్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో ఆ బిల్డింగ్ ను నేలమట్టం చేశారు.
ఇదిలా ఉంటే.. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది.