HYDRAA: స్వేచ్చ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షానికి నగరం నీట మునిగిందని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కారాదని హైడ్రా అధికారులతో పాటు డీఆర్ ఎఫ్ బృందాలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అందుకు హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు రౌండ్ ది క్లాక్ బీ అలర్ట్ గా ఉండాలని కూడా సూచించారు. ఊహించని విధంగా పడుతున్న వర్షాలకు అనుగుణంగా మన ప్రణాళికలుండాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై డీఆర్ఎఫ్ బృందాలకు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. వర్షం పడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది పూర్తి అవగాహన ఉండాలన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 913 చోట్ల వరద ముంచెత్తే ప్రాంతాలను గుర్తించామని, ఇందులో మేజర్ ప్రాబ్లం ఉన్న ప్రాంతాలు 257 ఉన్నాయని వివరించారు.
ఈ పాయింట్ల వద్ద డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండాలని సూచించారు. 51 డీఆర్ఎఫ్ బృందాలకు తోడు త్వరలోనే ఏర్పాటు కానున్న మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ( మెట్), స్టాటిక్ టీమ్లు కూడా అందుబాటులోకి రానున్నాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఈ బృందాలన్నీ ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. రౌండ్ ది క్లాక్ వాతావరణ హెచ్చరికలను క్షుణ్నంగా పరిశీలించి, వర్షానికి ముందే సన్నద్ధమవ్వాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తుతుందో, అందుకు పరిష్కారం ఏమిటో కూడా తెలియాలన్నారు. వర్షం పడినప్పుడు వరద ముంచెత్తకుండా చూడాలని, వర్షం లేనప్పుడు సమస్యకు కారణాలను అన్వేషించటంపై దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు.
Also read: MGNREGA: ఉపాధి హామీ పనిలో అక్రమాలకు చెక్.. ఇకపై మొత్తం 3 దశల ఫోటోల రూల్..!
వర్షాకాలం తలెత్తే సమస్య పరిష్కారంలో అవసరమై,తే ప్రజల సహకారం కూడా తీసుకోవాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ టీమ్ లకు, అధికారులకు సూచించారు. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్థానికులతో కలిసి కమిటీలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంలో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. అలాగే మ్యాన్హోల్స్ ఎక్కడ ఉన్నాయనేది గుర్తించే విధంగా అక్కడ దగ్గరలోని గోడకు మార్కింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 9వ తేదీన ఒక్కసారిగా కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాలపై సమీక్షించారు. అక్కడ వరద ముంచెత్తడానికి గల కారణాలను వివరించి, ఆ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రధాన రహదారులు ప్రథమ లక్ష్యంగా పని చేసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలన్నారు.
ఒక్క రోజు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తితే రూ. 400 కోట్ల వరకు నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారని తెలిపారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని హైడ్రా బృందాలు పని చేయాలని సూచించారు. అన్ని విభాగాలతో కలిసి ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. చెట్లు పడిపోయినప్పుడు సహాయక చర్యలు చేపట్టే సమయంలో మన డీఆర్ఎఫ్ వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదని, అలాంటి సమయంలో బైకులపై చేరే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముందు హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్. సుదర్శన్ మాట్లాడుతూ వర్షాకాల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. ఏసీపీలు పి. తిరుమల్, ఉమా మహేశ్వర రావు, శ్రీకాంత్, ఆర్ ఎఫ్ఓ జయప్రకాష్ తో పాటు డీఎఫ్ఓలు, ఎస్ఎఫ్ఓలు, ఇన్స్పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also read: మహీంద్రా కార్లకు ఎందుకింత డిమాండ్? 5 బలమైన కారణాలు ఇవే!