HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సర్కారు ఆస్తుల లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా ఇప్పటి వరకు అంఛనాలను మించి ఆస్తులను కాపాడింది. తాజాగా ఒకే రోజు మూడు భారీ ఆపరేషన్లను నిర్వహించి, చెరువు, ప్రభుత్వ భూమలను కాపాడింది. మంగళవారం ఒకే రోజు రెండు చెరువులను, మరో సర్కారు భూమిని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లో కబ్జాదారులు మాయం చేసిన 6.05 ఎకరాల ఈదులకుంట భూమిని గుర్తించి, కాపాడింది. ఆ పక్కనే ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమికి కూడా హైడ్రా కబ్జాల చెరనుంచి విముక్తి కల్పించింది. గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలోని కొత్త చెరువు మధ్యలో నుంచి బండ్ నిర్మించి ఎగువ ప్రాంతాన్ని కబ్జా చేయాలనే రియల్టర్ల ప్రయత్నాలకు హైడ్రా అనూహ్యంగా బ్రేకులు వేసింది. కొత్త చెరువులో మొత్తం 22 ఎకరాల భూమిని కాపాడింది. రెండు చోట్ల ఫెన్సింగ్ వేసి దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన భూమి కబ్జాల పాలవ్వకుండా హైడ్రా రక్షించింది. స్థానికుల ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖలతో పరిశీలించి చెరువుల కబ్జాలను హైడ్రా అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించుకున్న తర్వాతే యాక్షన్ లోకి దిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఐటీ కారిడార్లోని మాధాపూర్లో చెరువును మాయం చేయాలనే కబ్జాదదారుల ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నెంబరు 7లో ఉన్న 6.05 ఎకరాల ఈదులకుంటను కబ్జాల చెర నుంచి విడిపించింది. శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట నిండితే వరద కాలువ ద్వారా ఈదుల కుంటకు నీరు చేరేది. ఆ కాలువను డైవర్ట్ చేయడంతో ఈదుల కుంటకు వరద నీరు చేరకుండా చేశారు. చెరువు రూపురేఖలు మార్చేసి, హద్దులు చెరిపేసి, ఇక భవన నిర్మాణాలే ఆలస్యం అనుకున్న తరుణంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. తమ్మిడికుంట – ఈదులకుంట- సున్నం చెరువులుగా గొలుసుకట్టుగా ఉన్న వాటిలో ఈదుల కుంట అన్యాక్రాంతమవుతుందని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు నమోదయ్యింది. స్థానికుల ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రాకు అక్కడ చెరువు ఆనవాళ్లు కనిపించాయి. గ్రామ, రెవెన్యూ రికార్డుల మేరకు 6.05 ఎకరాల చెరువున్నట్టు నిర్ధారించుకుంది. ఇదే విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలు కూడా నిర్ధారించాయి. దీంతో మంగళవారం చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేసింది. 6.05 ఎకరాల ఈదులకుంటకు తోడు, ఆ పక్కనే సర్వే నెంబరు 11/37లో ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11.21 ఎకరాల భూమిని హైడ్రా సేవ్ చేసింది. ఇలా మొత్తం మాధాపూర్లోనే దాదాపు రూ. 1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. ఈ భూమి చుట్టూ హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తోంది.
Also Read: ఆకునూరి మురళికి కావాలనే పొగబెట్టారా? విద్యాశాఖలో పెద్దల మధ్య నడిచిన గొడవేంటి..?
రెండు రెవెన్యూ మండలాల్లో సరిహద్దుల్లో ఉండడం కబ్జాదారులకు ఈదులకుంటతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు సరి కొత్త ప్రయత్నం చేసినట్లు హైడ్రా గుర్తించింది. కూకట్పల్లి మండలం, కూకట్పల్లి గ్రామంలో చెరువు లేందంటూ కబ్జాదారులు చూపించారు. ఇదే సమయంలో శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లో 6.05 ఎకరాల చెరువు ఉంది. ఒకవేళ ఓవర్ల్యాప్ అయినా, చెరువును ఎవరూ మార్చలేరు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో ఇరు మండలాల అధికారులు చొరవ చూపాలి. అది జాప్యం జరగడంతో ఇదే అదనుగా ఎన్వీఎన్ కనస్ట్రక్షన్స్ కంపెనీ చేతివాటం చూపించింది. ఇదే అదనుగా 6.05 చెరువుతో పాటు సర్వే నెంబరు 11/37లో ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి నిర్మాణాలకు సిద్ధమయ్యారు. కూకట్పల్లి మండలం పరిధిలోకి వచ్చే సర్వే నెంబరు 1003 నుంచి 1006 వరకున్న భూమిని చూపించి 14 అంతస్తుల భవన నిర్మాణానికి సదరు సంస్థ 2022లో అనుమతులు తీసుకుంది. అయితే నిర్మాణాలు మాత్రం 6.05 ఎకరాల ఈదులకుంటలో చేపడుతున్నారు. ఈ మేరకు సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే విషయమై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారించారు. 6.05 ఎకరాల చెరువు స్థలంతో పాటు 5.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం మొత్తం 11.21 ఎకరాల భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
కోకాపేట చెరువుకు ‘కొత్త’ ఫెన్సింగ్..
ఐటీ సెజ్లకు చేరువలోని కోకాపేటలో కొత్త చెరువు కబ్జాలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధి 72 ఎకరాలు. అభివృద్ధి మాటున చెరువు మధ్యలో నుంచి కట్టకట్టి ఎగువున ఉన్న 20 ఎకరాలకు పైగా ఉన్న భూమిని కొంతమంది రియల్టర్లు కబ్జా చేశారు. ఫెన్సింగ్లు వేసి కొందరు, రేకుల ప్రహరీలతో మరి కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. వీరి కబ్జాలకు చెరువు మధ్యలో నిర్మించిన కట్ట ఆసరాగా మారింది. మరోవైపు గోల్డ్ ఫిష్ విల్లాలను నిర్మించిన రియల్టర్ కబ్జాలకు పాల్పడ్డాడు. తన పరిధి వరకూ విల్లాలు నిర్మించి ఓపెన్ ఏరియాగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని వినియోగించినట్లు హైడ్రా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. చెరువులో మట్టి పోసి ఏకంగా బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులను నిర్మించాడు. పిల్లల ప్లే ఏరియాను కూడా చెరువు పరిధిలోనే ఏర్పాటు చేశారు. ఇలా 1.09 ఎకరాల మేర చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా మంగళవారం తొలగించింది. చెరువు హద్దులను నిర్ధారించి, ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసింది. అలాగే చెరువు ఎగువ భాగంలో కూడా 20 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ణయించింది. భవిష్యత్తులో కబ్జాలకు అవకాశం లేకుండా హైడ్రా కొత్తగా ఫెన్సింగ్ వేసింది. ఇలా మరో రూ. 2200 కోట్ల విలువైన భూమితో పాటు ఒకే రోజు మూడు ఆపరేషన్లను నిర్వహించిన హైడ్రా మొత్తం రూ. 4 వేల కోట్ల విలువైన భూమిని కాపాడటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
Also Read: వివాదానికి తెరలేపిన బీజేపీ కల్లాల యాత్ర.. అసలు చిట్టా మర్చిపోయారా..!