High Court: అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేయాల్సి వస్తుందన్నారు. అంతేకాదు హైడ్రాను మూసి వేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది.
వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని సూచన చేసింది. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇవ్వాలని పేర్కొంది. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని కాసింత రుసరుసలాడింది.
అసలు కేసు ఏంటి?
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. తన స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చి వేశారని పేర్కొన్నాడు. ఆ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని వివరించారు. నిర్మాణాలకు 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఆర్గ్యుమెంట్ చేశారు. తర్వాత వాటిని రద్దు చేస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
ALSO READ: భార్యకు చిక్కిన జాయింట్ కమిషనర్
2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇన్నాళ్లు ఏం చేశారని నిలదీశారు. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదని సూటిగా ప్రశ్న వేసింది.అదే అసోసియేషన్ హైడ్రా రాక ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. పార్కు ఆక్రమణ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు లేవనెత్తింది.
పార్కు స్థలమని నిర్ణయించడానికి మీరెవరు? హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అన్న విషయం తెలియదా అని ప్రశ్నించింది. పిటిషనర్ను కబ్జాదారుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను నిలదీసింది. పిటిషనర్కు చెందిన స్థలంలో యథా స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి ఐదుకు వాయిదా వేశారు.